AP Village Ward Sachivalayam Employees Pension One Week Rule: ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మిగిలిన సొమ్మును వారం రోజుల్లోగా ప్రభుత్వానికి జమ చేయాలని సెర్ప్ అధికారులు ఆదేశించారు. పింఛన్ పంపిణీ పూర్తయిన వెంటనే డబ్బులు జమ చేయాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. జూన్ నెలలో ఇంకా రూ.4 కోట్లు సెర్ప్ ఖాతాకు చేరాల్సి ఉంది. గతంలో కొందరు ఉద్యోగులు నిధులతో ఉడాయించిన ఘటనలు జరిగాయి.
హైలైట్:
- ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు అలర్ట్
- ప్రతి నెలా పింఛన్ డబ్బులు రిటర్న్కు వారం గడువు
- వారం రోజుల్లోగా ప్రభుత్వానికి జమ చేయాలని ఆదేశం

ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు షాక్.. కొత్త రూల్ అమలు, ప్రతి నెలా వారం గడువు
కొంతమంది పింఛన్ లబ్ధిదారులు డబ్బులు తీసుకోకపోతే.. ఆపై వచ్చే నెలలో రెండు నెలల పింఛను కలిపి పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు డబ్బులు తిరిగి ఇవ్వడంలో ఆలస్యం జరగకుండా సెర్ప్ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే ప్రతి నెలలో పింఛను పంపిణీ అయిపోయిన తర్వాత వారం రోజుల్లోగా మిగిలిన డబ్బును సెర్ప్ ఖాతాలో జమ చేయాలని అధికారులు ఆదేశించారు. అయితే ఇటీవల కాలంలో కొందరు సచివాలయ ఉద్యోగులు పింఛన్ పంపిణీ చేయాల్సిన డబ్బులతో ఉడాయించిన సందర్భాలు ఉన్నాయి.. అయితే ఆ తర్వాత ఆ డబ్బుల్ని ప్రభుత్వ తిరిగి రికవరీ చేసింది. ఇలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం పింఛన్ పంపిణీ అయిపోయిన వెంటనే డబ్బుల్ని తిరిగి ప్రభుత్వానికి అందజేయాలని కోరుతోంది.