అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సుమారు 270 మంది మరణించారు. మృతదేహాలు గుర్తు పట్టకుండా మారడంతో డీఎన్ఏ పరీక్షలు చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. అలా ఇప్పటివరకు చాలా మంది మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. కాగా ఇదే ప్రమాదానికి సంబంధించి మ్యూజిక్ ఆల్బమ్స్ డైరెక్టర్, గుజరాతీ సినీ దర్శకుడు మహేష్ జీరావాలా మిస్సింగ్ మిస్టరీ విషాదంగా ముగిసింది. ఆహ్మదాబాద్బాద్లో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు. అతని మృతదేహాన్ని డీఎన్ఏ పరీక్ష ద్వారా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద స్థలంలో దొరికిన యాక్టివా స్కూటర్, ఫోన్ కూడా డైరెక్టర్ ను గుర్తింపుని నిర్ధారించడంలో ఉపయోగపడ్డాయని అధికారులు తెలిపారు. ఈ చిత్రనిర్మాత పూర్తి పేరు మహేష్ కలవాడియా అలియాస్ మహేష్ జిరావాలా. భార్య ఇచ్చిన సమాచారం ప్రకారం, మహేష్ చివరిగా ఉన్న ప్రదేశం సంఘటన జరిగిన ప్రదేశం నుంచి సుమారు 700 మీటర్ల దూరంలో ఉంది. అందువల్ల, కుటుంబం DNA పరీక్ష కోసం నమూనాలను ఇచ్చింది. చివరకు, పరీక్ష నిర్ధారించబడిన తర్వాత, మహేష్ జీరావాలా మరణాన్ని అధికారికంగా ప్రకటించారు.
కాగా జూన్ 12న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత ప్రమాద స్థలంలో మహేష్ జిరావాలా కాలిపోయిన యాక్టివా స్కూటర్ కనిపించిందని, దీంతో ఆ చిత్రనిర్మాత కూడా మరణించి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ప్రచారం జరిగింది. అలాగే అతని మొబైల్ ఫోన్ చివరిగా ప్రమాద స్థలంలో ట్రాక్ అయ్యిందని, అక్కడే అది స్విచ్ ఆఫ్ అయి ఉండడంతో మహేష్ మరణించి ఉండోచ్చన్న వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక DNA పరీక్షలో నిర్ధారించిన తర్వాత కూడా మహేష్ జిరావాలా కుటుంబం మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించింది. ఎందుకంటే ఇలాంటిది జరిగి ఉంటుందని వారు నమ్మలేకపోయారు. అయితే, పోలీసులు చివరకు యాక్టివా నంబర్, DNA రిపోర్ట్ వంటి బలమైన ఆధారాలను సమర్పించినప్పుడు, ఆ కుటుంబం షాక్ అయ్యింది. మహేష్ ఇక లేడని అయిష్టంగానే అంగీకరించాల్సి వచ్చింది.
ఎవరీ మహేష్ జిరావాలా ?
మహేష్ జిరావాలా నరోడా నివాసి. మ్యూజిక్ వీడియోలను తెరకెక్కించడంలో అతనికి విశేషమైన ప్రతిభ ఉంది. అంతేకాదు మహేష్ జిరావాలా ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థకు CEO కూడా. మహేష్ గుజరాతీలో చాలా మ్యూజిక్ వీడియోలు చేశాడు. అంతేకాదు అతను దర్శకత్వం వహించిన ఒక సినిమా కూడా 2019లో విడుదలైంది. మహేష్ జిరావారాకు భార్య హేతల్, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం, అహ్మదాబాద్ ప్రమాదంలో ఇప్పటివరకు మొత్తం 231 DNA మ్యాచ్లు జరిగాయి . 210 మృతదేహాలను కుటుంబాలకు అప్పగించారు. మృతుల్లో 155 మంది భారతీయులు, 36 మంది బ్రిటిష్ జాతీయులు, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులు, ఒక కెనడియన్ తో పాటు తొమ్మిది మంది స్థానికులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..