డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ యువకుడు.. కోర్టుకు హాజరై జరిమా కట్టాలని ట్రాఫిక్ పోలీసులు సూచించడంతో.. భయాందోళనకు గురై ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన భద్రాద్రి జిల్లా కొత్తగూడెం వన్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో బర్లిఫిట్ ఏరియాలో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన ఇరు గోపి(25). ఏడాది క్రితం ఖమ్మం ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. భార్య కొత్తగూడెంలో నర్సింగ్ చదువుతుండగా.. గోపి కూడా అక్కడే ఓ అద్దె ఇంట్లో ఉంటూ ప్రైవేటు వర్కర్గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇటీవల మద్యం సేవించిన తర్వాత బైక్ నడుపుతూ ఇంటికి వెళ్తున్న గోపి ట్రాఫిక్ పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డాడు. దీంతో గోపి వివరాలు తీసుకున్న పోలీసులు అతన్ని పంపేశారు.
అయితే, ఈ నెల 19న పోలీసులు గోపికి ఫోన్ చేసిన పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు సంబంధించి కోర్టుకు హాజరై జరిమానా కట్టాలని తెలిపారు. మరుసటి రోజు కలుస్తానని చెప్పిన గోపి శుక్రవారం సమయానికి రాకపోవడంతో పోలీసులు ఫోన్ చేసి గుర్తు చేశారు. అయితే జరిమానా కట్టకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందనీ పోలీసులు గోపికి తెలిపారు. దీంతో భయపడిపోయిన గోపి తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. తరువాత భార్యను కళాశాల వద్ద దింపి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇక కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిన గోపి భార్య ఇంట్లో దూలానికి వేలాడుతున్న భర్తను చూసి షాక్కు గురైంది. వెంటనే గోపి తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం తెలిపింది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న గోపి తల్లిదండ్రులు, కోడలిని తీసుకొని పోలీస్ స్టేషన్కు వెళ్లారు. కోర్టుకు వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు భయపెట్టడంతో తన భర్త ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని గోపి భార్య ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..