ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించారు. యండగండి – కోలమూరు కాలువ పనుల ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఉండి నియోజకవర్గంలోని అన్ని కాలువలు త్వరలో అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. అంతేకాకుండా కాలువల్లో చెత్త వేస్తే జరిమానా విధించే వినూత్న కార్యక్రమాన్ని రఘురామ ఉగాది సందర్భంగా ప్రారంభించారు. జరిమానా సొమ్మును కాలువల అభివృద్ధికి వినియోగిస్తామని ఆయన పేర్కొన్నారు.

అయితే పలు రాజకీయ, సామాజిక సమీకరణాల మధ్య రఘురామకృష్ణరాజుకు మంత్రి పదవి దక్కలేదు. అసెంబ్లీ స్పీకర్ను చేస్తారంటూ ప్రచారం జరగ్గా.. సీనియర్ నేత అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడికి ఆ అవకాశం దక్కింది. అయితే డిప్యూటీ స్పీకర్గా నియమించి.. రఘురామకృష్ణరాజుకు సముచిత స్థానం కల్పించారు చంద్రబాబు. డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు తన శైలిలో తనకు అప్పగించిన పనిని నిర్వహిస్తు్న్నారు. అయితే ఎమ్మెల్యేగానూ రఘురామకృష్ణరాజు.. ఉండి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రఘురామకృష్ణరాజు తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు పంచుకున్నారు. ఉండి మండలంలోని యండగండి – కోలమూరు కాలువ ఫోటోలను రఘురామకృష్ణరాజు పంచుకున్నారు.
“నా నియోజకవర్గంలోని కాలువల తవ్వకంలో భాగంగా ఉండి మండలంలో యండగండి – కోలమూరు కాలువ దృశ్యం. త్వరలో నా నియోజకవర్గంలో అన్ని కాలువలు, డ్రైన్లు ఇలాగే ఉంటాయి!” అంటూ రఘురామకృష్ణరాజు ట్వీట్ చేశారు. మరోవైపు ఉగాది పండుగ నాటి నుంచి.. ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు కొత్త కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఉగాది నుంచి ఫోటో కొట్టు, ప్రైజ్ మనీ పట్టు అంటూ వినూత్న కార్యక్రమం తీసుకువచ్చారు రఘురామ.
ఎవరైనా పంట కాలువలలో ప్లాస్టిక్, చెత్త వేస్తే రూ.1000 జరిమానా విధిస్తామని రఘురామకృష్ణరాజు ప్రకటించారు. అలా చెత్త, ప్లాస్టిక్ పంట కాలువలలో వేసే సమయంలో ఫోటో తీసి, అధికారులకు పంపిన వారికి జరిమానాలో రూ.500 బహుమతిగా అందిస్తామని చెప్పారు. జరిమానా ద్వారా వచ్చిన సొమ్ములను “Canal Development Fund” లో జమ చేసి కాలువల అభివృద్ధికి ఉపయోగిస్తామని రఘురామకృష్ణరాజు అప్పట్లో ప్రకటించారు.