ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతుల కోసం సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. రూ.52 కోట్ల వ్యయంతో ‘పెయ్య సాయం’ పేరుతో ఆడ దూడల ఉత్పత్తిని ప్రోత్సహించనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభించిన ఈ ప్రాజెక్టుతో పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ పథకం ద్వారా పాల ఉత్పత్తిని పెంచడమే కాకుండా, పశు సంపదను వృద్ధి చేయనున్నారు. మరి ఈ పథకం రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే వివరాలు తెలియాలంటే..
హైలైట్:
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- పెయ్య సాయం పేరిట కొత్త కార్యక్రమం
- కేవల ఆడ దూడలు మాత్రమే పుట్టేలా ఇంజెక్షన్లు

పెయ్య సాయం కార్యక్రమం కోసం రూ.52 కోట్లు ఖర్చు చేయనున్నారు. దీని ద్వారా కేవలం ఆడ దూడలు మాత్రమే పుట్టేలా చర్యలు తీసుకోన్నారు. మన దగ్గర పశువుల విషయానికి వస్తే.. ఆడవాటికే అధిక విలువ. మగ వాటిని చిన్న వయసులోనే అమ్మేస్తుంటారు. ఇక ఆవుల విషయంలో మేలు జాతి పెయ్య దూడ అయితే సంవత్సరం తర్వాత దాన్ని 50 వేల రూపాయలకు కూడా అమ్ముకోవచ్చు. ఈ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని.. మగ దూడల పుట్టుకను తగ్గించి.. కేవలం పెయ్య దూడలు మాత్రమే పుట్టేలా ఆధునిక పద్దతిలో వీర్యాన్ని సిద్ధం చేస్తున్నారు.
ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి .. వీర్యంలోని క్రోమోజోముల బరువు ఆధారంగా.. మగదూడలు పుట్టకకు కారణం అయ్యే క్రోమోజోములను వేరుచేస్తారు. ఆపై కేవలం పెయ్యదూడలు మాత్రమే పుట్టేలా వీర్యాన్ని సేకరిస్తారు. దీని ఒక్క డోసు ధరను రూ.1600గా నిర్ణయించారు. ఆ వీర్యం ఇంజక్షన్ చేసిన పశువుల్లో సుమారు 90 శాతానికి పైగా పెయ్యదూడలే జన్మిస్తున్నాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా లింగ నిర్ధారిత వీర్య సేకరణ కోసం దేశవాళీ జాతులైన సాహివాల్, హెచ్ఎఫ్, జెర్సీ, జెర్సీ సంకరజాతి, గిర్తో పాటుగా.. సంకరపరిచిన హెచ్ఎఫ్ జాతి ఆవుల పశువుల నిర్ధారిత వీర్యం కూడా వినియోగిస్తున్నారు.
కొన్నిరోజుల క్రితమే కుప్పంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. నియోజకవర్గం మొత్తం మీద.. పునరుత్పత్తికి అనుకూలంగా ఉన్న ఆవులు 80 వేల వరకు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఈక్రమంలో తొలి ఏడాదిలోనే 55 వేల పశువులకు లింగ నిర్ధారిత వీర్యం ఇవ్వాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ఇప్పటికే నియోజవర్గంలో సుమారు 8,900 పశువులకు కృత్రిమ గర్భధారణ చేపట్టారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఆవులు ఎదకు వచ్చే సమయాన్ని గుర్తించి కృత్రిమ గర్భధారణ చేస్తున్నారు. ప్రతిపాడి రైతు ఇంట పెయ్య దూడలు జన్మిస్తే.. రాష్ట్రంలో పాల ఉత్పత్తి, పశు సంపద భారీగా పెరుగుతాయని ఈ ప్రాజెక్ట్ డైరెక్ట్ తెలిపారు. పాడి రైతులు కూడా ఈ కార్యక్రమంపై ఆసక్తి చూపుతున్నారు.