ఈ రోజుల్లో ఒకట్రెండు సినిమాల అనుభవంతోనే ప్యాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నారు దర్శకులు. అందులో విజయం కూడా సాధిస్తున్నారు. కానీ కొందరు దర్శకులు మాత్రం ఎంత క్రేజ్ ఉన్నా.. తెలుగును వదలట్లేదు. స్టార్ డైరెక్టర్ అనే ముద్ర పడిన తర్వాత కూడా రీజినల్ సినిమాలకే పరిమితం అవుతున్నారు.
టాలీవుడ్లో త్రివిక్రమ్ రేంజ్ గురించి కొత్తగా ఏం చెప్పాలి..? ఎంత క్రేజ్ ఉన్నా.. ప్యాన్ ఇండియా వైపు వెళ్లలేదు గురూజీ. ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్తో ఆ ప్రయత్నం చేయనున్నారు. ఇప్పటి వరకైతే ఈయన పక్కా తెలుగు దర్శకుడే. తారక్కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ప్యాన్ ఇండియన్ ఎంట్రీ తప్పట్లేదు త్రివిక్రమ్కు. అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఇప్పటి వరకు ప్యాన్ ఇండియా జోలికి పోలేదు.
హాయిగా ఏ టెన్షన్ లేకుండా సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తూ సంచలనాలు సృష్టిస్తున్నారు అనిల్. వెంకటేష్తో చేసిన సంక్రాంతికి వస్తున్నాం కేవలం తెలుగులోనే 300 కోట్లకు పైగా వసూలు చేసి ఇండస్ట్రీ హిట్టైంది. ఈ దెబ్బతో అనిల్ క్రేజ్ కొండెక్కి కూర్చుంది. ప్రస్తుతం చిరంజీవితో సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి.
బాబీ సైతం డాకు మహారాజ్ను తెలుగుకే పరిమితం చేసారు.. తమిళం, హిందీలో తర్వాత డబ్ అయింది. సన్నీ డియోల్తో జాట్ను హిందీలోనే చేసారు గోపీచంద్ మలినేని. ఈ ఇద్దరు దర్శకుల నెక్ట్స్ సినిమా బాలయ్యతోనే తెలుగులోనే ఉండబోతుంది.
హరీష్ శంకర్ సైతం ఉస్తాద్ భగత్ సింగ్ను తెలుగులోనే తీస్తున్నారు. లేనిపోని హంగులకు పోయి ప్యాన్ ఇండియా అనేకంటే రీజినల్ కథలతో ఇక్కడే ఉంటున్నారు వీళ్లంతా.