పూర్తి స్వదేశీ పరిజ్ఞానం వినియోగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతూనే, నౌకాదళ సంపత్తి పెంపుతో ప్రపంచ దేశాలకు భారత్ సత్తా చాటుతోంది. సరిహద్దు తీరం వెంబడి నిరంతర నిఘా కొనసాగిస్తోంది. దాయాది దేశమైన పాకిస్థాన్, అలాగే చైనాతో ఏ క్షణమైనా ముప్పు ఉంటుందని అనుక్షణం అప్రమత్తమవుతూనే ఉంది. ప్రస్తుతం భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో… ఎప్పుడు పోరు జరిగినా చిత్తు చేయాలనే లక్ష్యాలతో భారత నౌకాదళ అమ్ముల పొదిలో అస్త్రాలను సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా విశాఖ తీరానికి ఓ శక్తివంతమైన యుద్ధ నౌక వచ్చింది. దాని గురించి తెలుసుకుంటే సెల్యూట్ కొట్టడమే కాదు, ఇది కదా మన దేశ సత్తా అంటూ తెగ గర్వపడతారు.
భారత నౌకాదళం అమ్ములపొదిలోకి అత్యాధునిక యుద్ధనౌక ఐఎన్ఎస్ నీలగిరి లాంఛనంగా ప్రవేశించింది. ముంబైలో తయారైన ఈ నౌక విశాఖపట్నం చేరుకుని తూర్పు నౌకాదళంలో భాగమైంది. సంప్రదాయ పద్ధతిలో ఐఎన్ఎస్ నీలగిరికి తూర్పు నౌకాదళం ఘనంగా స్వాగతం పలికింది. ఐఎన్ఎస్ నీలగిరి కేవలం ఓ నౌక కాదు.. ఇది కనిపించని యుద్ధ రథం. ప్రాజెక్ట్ 17A స్టెల్త్ ఫ్రిగేట్ శ్రేణిలో నిర్మించిన మొదటి నౌక ఇది. ఇందులో ఉపయోగించిన స్టెల్త్ టెక్నాలజీ వల్ల శత్రువు రాడార్లలో కనిపించదు.
విశాఖపట్నం ఇప్పటికే తూర్పు తీర నౌకాదళ ప్రధాన కేంద్రంగా ఉంది. INS నీలగిరి రాకతో విశాఖ నగరానికి రక్షణ, మిలిటరీ ప్రాధాన్యత మరింత పెరిగింది. ఇది నగరాభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. ఎందుకంటే ఇలాంటి యుద్ధ నౌకలు, వాటి రిపేర్లు, నిర్వహణ, సిబ్బంది అవసరాలు.. ఇవన్నీ నగరంలో ఉద్యోగావకాశాలు, పారిశ్రామిక అవసరాలు పెంచే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..