25 వేల టన్నుల బంగారానికి ఒరిజినల్ కేరాఫ్ హమారా ఇండియా. ఎస్.. మన దేశంలోని ఇళ్లు, గుళ్లలో ఉండే పసిడి దాదాపు రెండున్న కోట్ల కిలోలు. దీని విలువ అక్షరాలా 200 లక్షల కోట్ల రూపాయలు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన జీడీపీ అంచనాల్లో ఇది 56 శాతం. పాకిస్తాన్ ఎకానమీ కంటే ఆరు రెట్లు ఎక్కువ. అంతే కాదు.. ప్రపంచంలోని ప్రైవేట్ గోల్డ్ నిల్వల్లో 14 శాతం వాటా భారతదేశానిదే. ఈ లెక్కన గ్లోబల్గా అతిపెద్ద బంగారు కొండ మన ఇండియానే. ఇందులో ఐతే నో మోర్ డౌట్స్.
2020 నుంచి బంగారం ధరలు రాకెట్ వేగంతో పెరిగి దాదాపు రెట్టింపయ్యాయి. ఏడాది కాలంగా ఐతే.. పుత్తడి ధర ముట్టుకుంటే భగ్గుమంటోంది. పదిగ్రాముల పసిడి ధర లక్షకు అటూఇటూ అనగానే మిడిల్ క్లాసోడి గుండెలు గుభేల్ మంటున్నాయి. దిగువ మధ్యతరగతి మనిషైతే బంగారం షాపుల వైపే చూడ్డం మానేశాడు. ఫంక్షన్లు, పార్టీలైతే తప్ప తులమో అరతులమో కొనుక్కుని సర్దుకుంటున్నాడు. అంతమాత్రం చేత.. మన దేశమేం గోల్డు విషయంలో గొడ్డుపోలేదు. ధరలు రికార్డులు బద్దలుకొడుతున్నా కొనుగోళ్లు మాత్రం కోటలు దాటుతూనే ఉన్నాయి.
గత ఏడాది ఇండియాలో బంగారం డిమాండ్ ఏకంగా 782 టన్నులకు చేరింది. కరోనా ముందటి యావరేజ్ కంటే ఇది 15 శాతం ఎక్కువ. ఆర్నమెంట్ బంగారం డిమాండ్ కాస్త మందగించినా.. బంగారం కడ్డీలు, కాయిన్లలో పెట్టుబడులు అమాంతం పెరిగాయి. కస్టమ్స్ డ్యూటీ 15శాతం నుంచి 6శాతానికి తగ్గడంతో బంగారం రిటైల్ ఇన్వెస్ట్మెంట్లు ఘనంగా పెరిగాయి. కన్జ్యూమర్ల ఉత్సాహం ఇదే రేంజ్లో కొనసాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో బంగారం డిమాండ్ 725 టన్నులకు చేరుతుందన్నది యూబీఎస్ అంచనా. 2026 తర్వాత నెమ్మదించినా గోల్డ్ డిమాండ్ 800 టన్నుల దగ్గర స్థిరపడే ఛాన్సుంది. సో.. ప్రస్తుతం ఇండియాలో దాచిన బంగారం 25 వేల టన్నులు. ఏటా సగటున 8 వేల టన్నులు యాడవుతుంటే.. మన దేశపు బంగారం నిల్వలు ఏ స్థాయిలో పెరుగుతాయో ఊహలకే అందేలా లేదు.
యూబీఎస్ అంచనా ప్రకారం.. ఇళ్లలో ఉన్న బంగారంలో 2 శాతం కంటే తక్కువ మాత్రమే తనఖా కోసం గృహస్థులు బైటికి తీస్తున్నారు. మిగతాదంతా బీరువాల్లోనో బంకర్లలోనో రహస్య భాండాగారాల్లోనో దాక్కునే ఉంది. అలా నక్కిన కనకాన్ని బైటికి తీసే ప్రయత్నాల్లో భాగంగా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు గోల్డు లోన్లపై వడ్డీ రేట్లు తగ్గించినా లాభం లేకుండా పోతోంది.
ఎందుకంటే… భారతీయులకు బంగారంతో ముడిబడ్డ అంత గట్టిది. మనోళ్లు బంగారాన్ని కేవలం ఆస్తిగా కాదు.. ప్రతిష్టగా భావిస్తారు. పసిడి ఆభరణాలతో ఉండే ఎమోషనల్ అటాచ్మెంట్ కారణంగా దాన్ని అంత ఈజీగా తనఖా పెట్టరు.. తెగనమ్ముకోరు. బంగారాన్ని బంగారంగా ఉంచుకోడానికే ఇష్టపడతారు. ఇటువంటి భావోద్వేగాల వల్లే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్, సావరిన్ గోల్డ్ బాండ్స్ లాంటివన్నీ పెద్దగా సక్సెస్ కావడం లేదు.
ఇండియాలో బంగారం నిల్వలు భారీగా పెరుగుతున్నప్పటికీ.. దీన్ని సరిగ్గా లెక్కగట్టే మానిటైజేషన్ వ్యవస్థ మన దగ్గర లేదు. కానీ.. గత నిల్వలను, తాజా కొనుగోళ్లను కలుపుకుని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఎప్పటికప్పుడు మన పసిడి ఖజానా సైజును కాలిక్యులేట్ చేస్తూనే ఉంది. సో.. పాతిక వేల టన్నుల బంగారం పేరుకు మనోళ్లదే ఐనా.. అది పూర్తిగా వ్యక్తిగతం. దీన్ని జాతీయ సంపదగా చెప్పుకునే అవకాశమే లేదు. ఆ మాటకొస్తే 200 లక్షల కోట్ల విలువైన ఈ పసిడి భాండాగారం ఎందుకూ కొరగాని నిరర్ధక ఆస్తిగానే మిగిలిపోతోందా..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..