శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులో గత నెల 26న ఓ స్థలం విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. దీనికి సంబంధించి వైసీపీ నేత దాల్మిల్ సూరి, అతని సోదరుడు పాండుతో పాటు 30 మంది వ్యక్తులు.. అనంతపురం పట్టణానికి చెందిన సుశీలమ్మ అనే మహిళ వర్గీయులపై దాడి చేశారు. దాంతో.. కొత్తచెరువు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కాగా.. అప్పటినుంచి పాండు పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకుని తిరుగుతున్నాడు. పాండుపై గతంలోనూ అనేక కేసులు నమోదయ్యాయి. దాల్మిల్ సూరి, పాండు.. డొల్ల కంపెనీలు, వివిధ వ్యాపారాల పేరుతో ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల్లో భారీ ఎత్తున మోసాలకు పాల్పడ్డారు. చక్కెర, బియ్యం వ్యాపారాల పేర్లతో అమాయకులను మోసం చేసి.. కోట్ల రూపాయలు సంపాదించారు. ఈ క్రమంలోనే.. ఇరువురిపై 47 కేసులు నమోదు అయ్యాయి.
అంతర్రాష్ట్ర ఘరానా మోసగాడిగా ముద్ర పడ్డ పాండుపై నాలుగు NIA కేసులు కూడా ఉన్నాయి. అయితే.. ఆయా కేసుల్లో తప్పించుకుంటూ పోలీసులకే సవాలుగా మారిన పాండు.. ఎట్టకేలకు ఓ స్థలం వివాదం కేసులో బుక్కయ్యాడు. స్పెషల్ టీమ్ దర్యాప్తుతో బెంగళూరులో పోలీసులకు చిక్కాడు. పాండుపై ఏపీలో 29 కేసులు.. మిగతా రాష్ట్రాల్లో 14 కేసులు ఉన్నాయన్నారు పుట్టపర్తి డీఎస్పీ విజయ్కుమార్. ఓ కేసులో తిహార్ జైల్లో రెండున్నరేళ్లు శిక్ష కూడా అనుభవించినట్లు తెలిపారు. దాల్మిల్ సూరి, అతని భార్య మహాలక్ష్మీ పరారీలో ఉండడంతో గాలిస్తున్నామన్నారు. మొత్తంగా.. మోస్ట్ వాంటెడ్ రౌడీషీటర్గా పేరున్న పాండు అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు శ్రీసత్యసాయి జిల్లాల్లో హాట్టాపిక్గా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..