పండ్ల డైట్ అంటే దాదాపు మొత్తం ఆహారాన్ని పండ్లపైనే ఆధారపడటం. కొంతమంది ఇందులో పచ్చి కూరగాయలు, గింజలు, విత్తనాలను కూడా కలుపుతారు. కానీ అన్నం, ధాన్యాలు, పాలు, మాంసం లాంటి ముఖ్యమైన ఆహారాలను పూర్తిగా మానేస్తారు. పండ్లు తినడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రోటీన్, మంచి కొవ్వులు అందడం కష్టం. దీని వల్ల శరీరం బలహీనపడుతుంది. కండరాల సమస్యలు వస్తాయి. జబ్బులు రాకుండా కాపాడే శక్తి తగ్గుతుంది.
పండ్లలో సహజంగా చక్కెర ఉంటుంది. ఎక్కువ మొత్తంలో పండ్లు తింటే రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. దాని వల్ల షుగర్ లాంటి సమస్యలు రావచ్చు. పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఎక్కువ తింటే మలబద్ధకం లేదా డయేరియా లాంటి సమస్యలు వస్తాయి.
పండ్లలో కాల్షియం, విటమిన్ డి తక్కువగా ఉంటాయి. ఎక్కువ కాలం పండ్లపైనే ఆధారపడితే ఎముకలు బలహీనపడే ప్రమాదం ఉంది. పండ్లలో ఉండే పుల్లని పదార్థాలు దంతాలపై ఉండే ఎనామెల్ ను ప్రభావితం చేస్తాయి. దీని వల్ల పళ్లు జివ్వుమని లాగడం, పళ్లు పాడవడం లాంటివి జరగవచ్చు.
పండ్లు త్వరగా జీర్ణమవుతాయి కానీ ఎక్కువసేపు శక్తిని ఇవ్వలేవు. దాని వల్ల అలసట, నీరసం వస్తుంది. ఐరన్, బి12, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్ లాంటి పోషకాలు పండ్లలో తక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా అవసరం.
విటమిన్ సి, పొటాషియం లాంటి పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల పండ్లు గుండెకు మంచివి. పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. తక్కువ కేలరీలు ఉంటాయి. బరువును అదుపులో ఉంచుకోవడానికి సాయపడతాయి.
సాధారణంగా పండ్లను రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. కానీ కేవలం పండ్లపైనే ఆధారపడితే ముఖ్యమైన పోషకాలు శరీరానికి అందవు. దాని వల్ల ప్రమాదం ఉంది. ఆరోగ్యాన్ని ఎక్కువ కాలం కాపాడుకోవాలంటే సమతుల్య ఆహారం అవసరం. ఎప్పుడైనా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలంటే ముందుగా డాక్టర్ సలహా తప్పకుండా తీసుకోవాలి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)