చనిపోయిందనకుని మహిళకు అంత్యక్రియలు చేసిన నెల రోజులకే ఆ మహిళ ఇంటికి తిరిగి వచ్చిన ఘటన బిహార్ రాష్ట్రంలోని మొహబ్బత్ పర్సా పంచాయతీలోని భాద్ప నయా బస్తీలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొహబ్బత్ పర్సాకు చెందిన రామ్ స్వరూప్ రాయ్కు రమా దేవి అనే మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఆమె గత నెల 17వ తేదీనా అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. దీంతో కంగారుపడిపోయిన కుటుంబ సభ్యులు ఆమె కోసం చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో వెతికారు. కానీ వారికి ఎక్కడా రమాదేవీ ఆచూకీ దొరకలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె గురించి వెతకడం ఆపేశారు.
అయితే వారం రోజుల తర్వాత థానా ఘాట్కు సమీపంలోని నది ఒడ్డున ఓ మహిళ మృతదేహం లభించిందన్న సమాచారం అందుకున్న రమాదేవి బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని, ఆ మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం ఆకారం, పరిమాణంలో చూసి తప్పిపోయిన రమాదేవినేమో అనుకొని స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. పోస్ట్మార్టం తర్వాత ఆ మృతదేహాన్ని రమాదేవి బంధువులకు అప్పగించారు.
అయితే ఆ మృతదేహాన్ని తీసుకెళ్లిన బంధువులు తమ సాంప్రదాయం ప్రకారం దహనం సంస్కరణాలు జరిపించి.. జూన్ 11న కర్మకాండలు కూడా చేశారు. అయితే ఈ కార్యక్రమాలు పూర్తైన సుమారు 20 రోజుల తర్వాత అనగా జూన్ 22 ఉదయం ఆ మహిళ భాద్ప నయా బస్తీలోని ఇంటికి చేరుకుంది. అయితే ఇంటికి వచ్చిన రమాదేవి చూసి కుటుంబ సభ్యులు అందరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. మొదట నిజంగానే మనిషా..లేదా అని భయపడిపోయారు. తీరా వచ్చింది నిజంగానే రమావేది కావడంతో ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. చనిపోయిందని విషాదంలో ఉన్న కుటుంబం రమాదేవి తిరిగి రావడంతో ఆనందంలో మునిగిపోయింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..