మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద కేసు నమోదైంది. వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో జరిగిన ప్రమాదంలో సింగయ్య అనే వ్యక్తి చనిపోయారు. ఈ కేసులో వైఎస్ జగన్ను నిందితుడిగా చేర్చినట్లు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ఆదివారం వెల్లడించారు. మరోవైపు సింగయ్య మృతిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

ఎస్పీ సతీష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ” జూన్ 18న వైఎస్ జగన్ పల్నాడు జిల్లాలో పర్యటించారు. వైఎస్ జగన్ పర్యటన సమయంలో గుంటూరులోని ఏటుకూరు రోడ్డులో ఒక ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన తీవ్ర గాయాలతో ఒక వృద్ధుడు పడి ఉన్నాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. డ్రోన్ వీడియోలు, సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించాం. అలాగే అక్కడ ఉన్నవారు తీసిన వీడియోలను కూడా పరిశీలించాం. మాజీ సీఎం వైఎస్ జగన్ కారు కింద సింగయ్య పడినట్టు వీడియోలో ఉంది” అని ఎస్పీ తెలిపారు. వీడియోలను, ఇతర ఆధారాలను పరిశీలించాక కేసు నమోదు చేశామన్నారు.
మరోవైపు ఈ కేసులో వైఎస్ జగన్తో పాటుగా కారు డ్రైవర్ రమణారెడ్డి, నాగేశ్వర్రెడ్డి, సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనిపై కేసు నమోదు చేశారు. వైఎస్ జగన్ పల్నాడు పర్యటనకు 14 వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు గుంటూరు ఎస్పీ తెలిపారు. కానీ తాడేపల్లి నుంచి కాన్వాయ్ మొదలైనప్పుడు 50 వాహనాల్లో వచ్చారని వెల్లడించారు.