ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుబ్రమణ్య భక్తుల సమీకరణ కోసం హిందూ మున్నని ఆధ్వర్యంలో ఈ భారీ కార్యక్రమం చేపట్టారు. లక్షలాది మంది భక్తులు సుబ్రమణ్య స్వామి కంద షష్ఠి కవచాన్ని పఠించిన ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ధర్మం కోసం నిలబడే ప్రతి అడగు మనల్ని విజయతీరాలకు చేరుస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మధురైలోని అమ్మతిడల్ ప్రాంగణంలో హిందూ మున్నాని సంస్థ నిర్వహించిన మురుగ భక్తర్గళ్ మానాడు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు. ‘సజ్జనుడికి వచ్చే కోపం చాలా భయంకరంగా ఉంటుంది. నీతిగా, నిజాయతీగా జీవితాన్ని కొనసాగించే వారిని అమాయకులుగా భావించి దాడి చేస్తే.. ఫలితాలు తీవ్రంగా ఉంటాయని పవన్ హెచ్చరించారు.
లౌకిక వాదం ముసుగులో కొందరు… హిందువుల మత ఆచారారాలను వెక్కిరిస్తున్నారని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర మతాల గురించి మాట్లాడేకంటే, హిందువుల ఆచారాలంటే వారికి ఎనలేని ఏహ్యత. ఈ దేశంలో ఏం జరిగినా హిందువులు నోరెత్తకూడదు అనేలా ప్రసంగాలు ఇస్తారని ఎద్దేవా చేశారు. దానికే సెక్యూలరిజం అని పేరు పెడతారు. ఇదేమీ తీరు. సెక్యూలరిజం అంటే ప్రత్యేకంగా హిందువులకే సంబంధించినది మాత్రమే కాదు. ఏ మతంలో తప్పు జరిగినా ప్రశించాలి. సూడో సెక్యూలరిస్టులకు మాత్రం కేవలం హిందువులు మాత్రమే కనిపించడం శోచనీయమని పవన్ కల్యాణ్ అన్నారు.
ఎక్కడ ధర్మం దారి తప్పితే అక్కడే పోరాటం ఉంటుందన్నారు పవన్ కల్యాణ్. కావాలనే ఉత్తరాదితో పోలుస్తూ సమస్యను పక్కదారి పట్టించడమే కాదు.. ప్రజల్లో విభజనవాదం తీసుకురావాలనే కుట్ర దాగి ఉందన్నారు. ఇలాంటి విభజన ఆలోచనలు ఉన్నవారు చాలా ప్రమాదం. ఇలాంటి వారు శివునిపై, అమ్మవారిపై కూడా ప్రశ్నలు వేస్తారన్నారు. దేశంలో ఎక్కడ ధర్మం దారి తప్పినా అక్కడ సంఘటితంగా పోరాడటం కచ్చితంగా చేయాల్సిన పని అన్నారు. స్వయంగా ఆ శివపుత్రుడి వివాహం జరిగిన మధురై నేలను మళ్లీ అపవిత్రం చేసేందుకు ఇప్పుడు కొన్ని శక్తులు బలంగా ప్రయత్నిస్తున్నాయి. వినాశకాలే విపరీత బుద్ది అని ఇక్కడ పాలకులు కూడా ఆ శక్తులకు మద్దతు తెలుపుతున్నాయి. శ్రీ ముత్తు రామలింగ దేవర్ ప్రజల కోసం పోరాడిన ప్రాంతం నుంచి ఈ కార్యక్రమం మొదలుకావడం, మనమంతా ఐక్యం కావడం మురుగన్ దయవల్లనే అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
కొందరు కుత్సిత ఆలోచనలు చేసినా మురుగన్ ధర్మం ఆగదన్నారు పవన్. కార్తికేయుడిగా పిలిచినా, సుబ్రమణ్యేశ్వర స్వామిగా పిలిచినా, మురుగున్ గా కొలిచినా భక్తులకు ఆయన చూపే దారి, చెప్పే ధర్మం ఓ గొప్ప విజయానికి చూపే మార్గంగా భావిస్తామన్నారు. మార్పు అనేది తీసుకురావడం కష్టం కాదు. కానీ ఓర్పు కావాలి. దానికి మనమంతా సంసిద్ధులై ఐక్యంగా ముందుకు వెళ్లాలన్నారు. త్వరలోనే మార్పు తథ్యం. అనుకున్నది సాధిస్తాం.’’ అని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నైనార్ నాగేంద్రన్, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు అన్నామలై, ఆర్ ఎస్ ఎస్ క్షేత్ర సంచాలక్ వన్నిరాజన్, హిందూ మున్నాని సంస్థ అధ్యక్షులు కదేశ్వర సుబ్రమణియం, తదితరులు పాల్గొన్నారు.
ఇదిలావుంటే, ఇటీవలే అన్నాడిఎంకేతో పొత్తు పెట్టుకుని బలపడ్డట్టు కనిపిస్తున్న ఎన్డీఏ కూటమి.. అదే దూకుడుతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం కసరత్తు చేస్తోంది. సహజంగానే తమిళనాట ప్రాంతీయ పార్టీలదే హవా. ఆ సెంటిమెంట్కి బ్రేక్ ఇస్తూ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ బలపడాలంటే హిందుత్వ కార్డును జనంలోకి మరింత సాలిడ్గా ప్రవేశపెట్టాలి. మదురై మురుగన్ మహానాడు ఆ వ్యూహంలో భాగమేనా అనేది తాజా చర్చ.
పైగా… ఈ సమ్మేళనానికి నేతృత్వం వహిస్తున్న హిందూ మున్ననికి మాతృసంస్థ ఆర్ఎస్ఎస్. హిందూ మున్నని అధ్యక్షుడు రామగోపాలన్ గతంలో సంఘ్ పరివార్లో చురుగ్గా పనిచేశారు. బీజేపీతో సన్నిహిత సంబంధాలున్నాయి. హిందూ మున్నని నేతలు కొందరు ఇస్లామిక్ తీవ్రవాద సంస్థల హిట్లిస్టులో ఉన్నారు. ఇలా అతివాద సంస్థగా పేరున్న హిందూమున్నని పిలుపును మన్నించి కార్యక్రమానికి అతిథిగా వెళ్లారు పవన్కల్యాణ్.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..