తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. లడ్డూ ప్రసాదం కొనుగోలు మరింత సులభతరం చేస్తూ, ప్రత్యేక కియోస్క్ యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. యూపీఐ చెల్లింపుల ద్వారా నగదు రహిత లావాదేవీలు జరపవచ్చు. దర్శనం టికెట్ ఉన్నవారు, లేనివారు కూడా ఈ యంత్రం ద్వారా లడ్డూలు పొందవచ్చు. అంతేకాకుండా, టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు పలువురు భక్తులు విరాళాలు అందజేశారు.

*తిరుమలకు వెళ్లే భక్తుల కష్టాలకు చెక్.. ఇకపై ఆలస్యం కాకుండా, చాలా త్వరగా!
కియోస్క్ యంత్రం ద్వారా ఎలా లడ్డూలు పొందాలంటే..
కియోస్క్ యంత్రం ద్వారా ఎలా లడ్డూలు పొందవచ్చనే విధానాన్ని కూడా టీటీడీ వివరించింది. లడ్డూ విక్రయ కేంద్రాలకు సమీపంలో ఈ కియోస్క్ యంత్రం ఏర్పాటు చేశారు. కియోస్క్ యంత్రంలో రెండు ఆప్షన్లు ఉంటాయి. అందులో ఒకటి దర్శన టికెట్ ఉన్నవారు.. రెండోది దర్శన టికెట్ లేనివారు. భక్తులు ఇందులో ఒక ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. దర్శన టికెట్ ఉన్న భక్తులు.. తమ ఆప్షన్ 1 ఎంచుకోవాలి. ఆ తర్వాత టికెట్ వివరాలను యంత్రం ధృవీకరిస్తుంది. మరోవైపు టికెట్లో ఉన్న వ్యక్తుల సంఖ్య ఆధారంగా.. ప్రతి వ్యక్తి 2 అదనపు లడ్డూల వరకు కొనుగోలు చేయవచ్చని టీటీడీ తెలిపింది.
తిరుమల: శ్రీవారి భక్తులకు శుభవార్త.. లడ్డూల కోసం నిరీక్షించాల్సిన పని లేదు..
దర్శన టికెట్ లేనివారు ఆప్షన్ 2 ఎంచుకోవాలి. ఆ తర్వాత తమ ఆధార్ నంబర్ ఇవ్వాలి. దర్శనం టికెట్ లేని వ్యక్తి కూడా కియోస్క్ యంత్రం ద్వారా 2 లడ్డూల వరకు కొనుగోలు చేయవచ్చు. ఆప్షన్ ఎంచుకున్న తర్వాత యూపీఐ ద్వారా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. లావాదేవీ పూర్తి చేసిన తర్వాత రసీదు అందుతుంది. ఆ రసీదు తీసుకుని లడ్డూ కౌంటర్ల వద్దకు వెళ్తే.. అక్కడ అదనపు లడ్డూలు పొందవచ్చు. ఈ విషయాన్ని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. కియోస్క్ యంత్రం ద్వారా భక్తులు లడ్డూల కోసం ఎక్కువ సమయం నిరీక్షించాల్సిన అవసరం ఉండదని టీటీడీ తెలిపింది.
టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు విరాళం
మరోవైపు టీటీడికి సోమవారం భక్తులు భారీ విరాళాలు అందించారు. ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు పలువురు భక్తులు సోమవారం విరాళాలు అందజేశారు. బెంగళూరుకు చెందిన అగర్వాల్ ఇండెక్స్ ఫర్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళంగా అందించింది. రాఘవేంద్ర అన్నమయ్య భవనంలో సంస్థ ప్రతినిధులు అదనపు ఈవో వెంకయ్య చౌదరికి విరాళానికి సంబంధించిన డీడీను అందజేశారు. రాజస్థాన్కు చెందిన ఏకే ఇంజినీరింగ్ కంపెనీ సైతం ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10,59,000 విరాళంగా అందించింది.