చిత్తూరు జిల్లాలో మామిడి రైతు కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మామిడి కాయలను అమ్ముకోవడం అంత ఈజీ పని కాదు. మామిడి గుజ్జు పరిశ్రమల ముందు రోజుల తరబడి నిరీక్షిస్తే తప్ప అమ్ముకో లేని పరిస్థితి. ట్రాక్టర్లలో మామిడి కాయలను పెట్టుకుని పడిగాపులు కాచే రైతులు రోజుల తరబడి ఓపికతో ఉండాల్సిన పరిస్థితి. ఇలా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పల్ప్ ప్రాసెస్ చేస్తున్న 25 మామిడి గుజ్జు పరిశ్రమల వద్ద రైతులు పడుతున్న అగచాట్లు అందరి మనసులను కరిగిస్తోంది. చిత్తూరు జిల్లాలోని హైవేలపై బారులు తీరిన మామిడికాయల ట్రాక్టర్ల దృశ్యాలను చూసి రైతు కొచ్చిన కష్టం పై ఆవేదన వ్యక్తం అవుతోంది.
చిత్తూరు- పుత్తూరు-చెన్నై, చిత్తూరు- పలమనేరు- బెంగళూరు హైవేలపై నిద్ర హారాలకు దూరమైన రైతులు ట్రాక్టర్ల వద్దే ఉంటున్నారు. గుజ్జు పరిశ్రమల వద్ద కిలోమీటర్ల మేర మామిడి లోడుతో ట్రాక్టర్లు నిలిచిపోయిన దృశ్యాలను చూసిన వాహనదారులు మామిడి రైతు కష్టంపై ఆరాధిస్తున్నారు. గంగాధర నెల్లూరు మండలంలో కొనసాగుతున్న మామిడి రైతుల కష్టాలు సినీ నటుడు శివాజీ రాజా కొడుకు విజయ్ రాజా కంట పడింది.
జైన్ ఫామ్ ఫ్రెష్ మ్యాంగో ఫ్యాక్టరీ వద్ద పడిగాపులు కాస్తున్న 500 మంది రైతుల పడిగాపులపై చలించిన సినీ నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా రైతులకు భోజనాలు పంపిణీ చేసారు.
ఒక సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు అటుగా వెళుతూ పరిస్థితి తెలుసుకున్న నటుడు విజయ్ రాజా మామిడి రైతులు పడుతున్న కష్టాలను చూసి తన వంతు సహాయంగా 500 మందికి భోజనం ప్యాకెట్లు అందించారు. ఆది ప్రొడక్షన్ బ్యానర్ పై పాలసముద్రం మండలంలో జరుగుతున్న సినిమా షూటింగ్ కోసం వచ్చిన విజయ్ రాజా దాతృత్వం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..