ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. ఆటోడ్రైవర్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ వినిపించారు. ఆగస్ట్ 15న ఆటోడ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఏపీ ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఆరోజునే ఆటోడ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు చంద్రబాబు.

సూపర్ సిక్స్ హామీలలో భాగంగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చింది. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీ అమలు కోసం సీఎం చంద్రబాబు కసరత్తు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కేబినెట్ సబ్ కమిటీ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్న రాష్ట్రాలలో అనుసరిస్తున్న విధానాలను పరిశీలించింది. మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణిలతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం బెంగళూరులోనూ పర్యటించి అక్కడి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను పరిశీలించింది. అన్ని అంశాలపై కసరత్తు చేసిన తర్వాత ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.మరోవైపు తెలంగాణలో మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేస్తున్నారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఉచిత బస్సు కారణంగా తమ ఉపాధి దెబ్బతిందని ఆటోడ్రైవర్లు వాపోతున్నారు. ఆటో తోలుతూ నాలుగు రాళ్లు వెనకేసుకునే తమకు.. ఉచిత బస్సు కారణంగా గిరాకీలు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ముందుచూపుతో.. ఆటోడ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే తెలంగాణ మాదిరిగా రాష్ట్రం మొత్తం ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తోంది. ఏపీ ప్రభుత్వం రాష్ట్రం మొత్తం అమలుచేస్తుందా.. జిల్లాలకే పరిమితం చేస్తుందా చూడాల్సి ఉంది.