బనకచర్ల ప్రాజెక్టు రాయలసీమకు గేమ్ ఛేంజర్గా మారుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గోదావరి నుంచి వృథాగా పోయే 200 టీఎంసీల నీటిని ఉపయోగించుకుంటే రాయలసీమకు మేలు జరుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఇది తమ నీటి హక్కులకు భంగం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే, వృథాగా పోయే నీటిని మాత్రమే వాడుకుంటామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

గోదావరి జలాల వినియోగంతో ఇటు ఏపీతో పాటుగా అటు తెలంగాణకూ ఉపయోగకరంగా ఉంటుందని చంద్రబాబు సూచించారు. మిగులు జలాలను రెండు రాష్ట్రాలు వాడుకోవచ్చని సూచించారు. ఎంత వాడుకున్నా కూడా 200 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని ఉపయోగించుకునే అవకాశం లేదని చంద్రబాబు అన్నారు. గోదావరి జలాలను పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణానది బేసిన్లోకి.. అక్కడి నుంచి రాయలసీమలోని పెన్నాబేసిన్కు తరలించేందుకు గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది.
రూ. 80,000 కోట్ల వ్యయంతో బనకచర్ల ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రణాళికలు రచించారు. అయితే, తెలంగాణ ప్రభుత్వంఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తోంది. బనకచర్ల ప్రాజెక్టు గోదావరి నీటి వివాదాల ట్రైబ్యునల్, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం నిబంధనలకు విరుద్ధమని చెబుతోంది. బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణ నీటి హక్కులకు భంగం కలిగిస్తుందని తెలంగాణ ప్రభుత్వం వాదన.
గోదావరి నదిలో రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేశారు. అయితే బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తమకు కేటాయించిన నీరు దారి మళ్లించే అవకాశం ఉందని, భవిష్యత్తులో సాగు, తాగునీటి అవసరాలను ప్రభావితం చేసే అవకాశం ఉందంటోంది. బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలవనరుల శాఖ, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, ఏపెక్స్ కౌన్సిల్కు తెలియజేయకుండా, అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది.
అయితే బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం వాదన మరోలా ఉంది. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా సముద్రంలోకి వృథాగా పోయే 200 టీఎంసీల గోదావరి వరద నీటిని ఉపయోగించుకుంటామని ఆయన చెప్తున్నారు. దీని వలన ఎగువ రాష్ట్రాలకు ఎటువంటి నష్టం ఉండదని చెప్తున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అయిన నేపథ్యంలో.. దాని లింక్ ప్రాజెక్టు అయిన గోదావరి – బనకచర్ల లింక్ ప్రాజెక్టు చట్టబద్దమైనదేనని ఏపీ ప్రభుత్వం వాదన. సముద్రంలోకి వృథాగా పోయే నీటితో రాయలసీమ ప్రాంతంలో సాగు, తాగునీటి అవసరాలను తీర్చవచ్చని ఏపీ ప్రభుత్వం చెప్తోంది.