ఆ అమ్మాయి ఓ బ్రిలియంట్ స్టూటెండ్, ఆమె 10వ తరగతి బోర్డు పరీక్షలలో 92.60 శాతం మార్కులు సాధించింది. కానీ ఇంటర్ సెకండ్ ఇయర్ సమయంలో నీట్ ఎంట్రెన్స్ కోసం ప్రిపరేషన్లో భాగంగా రాసిన ఒక మాక్టెస్ట్లో తక్కువ మార్కులు రావడంతో ఆమె తండ్రి కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక ప్రాణాలు వదిలింది. దారుణ ఘటన మహారాష్ట్రలోని సాంగ్లిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. సాంగ్లికి చెందిన ధోండిరామ్ భోంస్లే స్థానికంగా ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి 17 ఏళ్ల ఓ కూతురు కూడా ఉంది. ఆమె పేరు సాధన భోంస్లే, ఈమె ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూ ప్రీ-మెడికల్ టెస్ట్, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ( నీట్) కోసం శిక్షణ తీసుకొంటోంది.
అయితే నీట్ ఎంట్రెన్స్ కోసం ప్రిపరేషన్లో భాగంగా సాధన భోంస్లే ఒ మాక్ టెస్ట్ లు రాస్తోంది. ఈ క్రమంలో ఒక మాక్ టెస్ట్లో సాధనకు తక్కువ మార్కులు రావడంతో ధోండిరామ్ భోంస్లే సాధన చదవు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోపంలో కర్ర తీసుకొని సాధనను ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. తండ్రి దాడిలో సాధన తీవ్రంగా గాయపడింది. దీంతో వెంటనే ఆమెను తండ్రి హాస్పిటల్కు తరలించాడు. కాగా సాధన హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది.
ఈ విషయం తెలుసుకున్న సాధన తల్లి జూన్ 22న భర్తపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన కూతురికి నీట్ మాక్ టెస్ట్లో తక్కువ మార్కులు వచ్చాయని తండ్రి తనను కొట్టాడని, తండ్రి కొట్టడంతో తీవ్రంగా గాయపడిన సాధన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిందని సాధన తల్లి ఫిర్యాదులో పేర్కొంది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాధన తండ్రి బోంస్లేను అదుపులోకి తీసున్నారు. అతన్ని విచారించగా బోంస్లే నిజం ఒప్పుకోవడంతో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..