Sugavasi Bala Subramanyam To Join In Ysrcp: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ్రాయుడు కుమారుడు సుబ్రహ్మణ్యం వైఎస్సార్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. నాలుగు దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగిన సుగవాసి కుటుంబం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తాడేపల్లిలో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. రాయచోటి నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న సుబ్రహ్మణ్యం రాకతో వైఎస్సార్సీపీకి మరింత బలం చేకూరనుందని భావిస్తున్నారు.
హైలైట్:
- ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం
- వైసీపీలో చేరబోతున్న టీడీపీ నేత
- ఇటీవల టీడీపీకి రాజీనామా చేశారు

సుగవాసి పాలకొండ్రాయుడు రాజకీయ వారసుడిగా సుబ్రహ్మణ్యం 1995 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. ఆయన రాయచోటి జడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు.. 2000లో ఉమ్మడి కడప జిల్లా పరిషత్ ఛైరమన్గా పని చేశారు. 2001లో మరోసారి రాయచోటి జడ్పీటీసీగా గెలిచారు. ఆయన రాయచోటిలో 2012లో జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. 2024లో రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. సుబ్రహ్మణ్యం మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు పెద్దకుమారుడు.. గత నెలలో పాలకొండ్రాయుడు మరణించిన సంగతి తెలిసిందే.
టీడీపీని వీడి వైసీపీలోకి సీనియర్ నేత.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం
1978 ఎన్నికల్లో సుగవాసి పాలకొండ్రాయుడు రాయచోటి నుంచి జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1983లో మళ్లీ రాయచోటి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరి 1984 ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా పోటీచేసి గెలవగా.. 1999, 2004 ఎన్నికల్లో వరుసగా రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా విజయాన్ని అందుకున్నారు. గత 43 ఏళ్లుగా ఈ కుటుంబం టీడీపీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు సుబ్రహ్మణ్యం గత ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీచేసి ఓడారు. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా కనిపించారు. ఇంతలో కొంతకాలంగా రాజంపేట నియోజకవర్గంలో పరిణామాలతో టీడీపీకి రాజీనామా చేశారు.. ఇప్పుడు వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.