Tirumala Sri Venkateswara Museum Works: తిరుమలలో శ్రీ వేంకటేశ్వర మ్యూజియం అభివృద్ధి పనులపై టీటీడీ దృష్టి సారించింది. ప్రపంచ స్థాయి వస్తు ప్రదర్శనశాలగా తీర్చిదిద్దాలని అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి అధికారులకు సూచించారు. భద్రతా చర్యలు, ఆధునిక సాంకేతికతను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మరోవైపు, ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు పలువురు భక్తులు విరాళాలు అందించారు. జూలై 6 నుండి 9 వరకు శ్రీ కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి.
హైలైట్:
- తిరుమల వెళ్లే భక్తులకు సరికొత్త అనుభూతి
- టీటీడీ శ్రీ వేంకటేశ్వర మ్యూజియం అభివృద్ధి
- త్వరలో ప్రారంభించే దిశగా టీటీడీ అడుగులు

టీటీడీకి విరాళం
‘టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు సోమవారం పలువురు భక్తులు విరాళం అందించారు. బెంగళూరుకు చెందిన అగర్వాల్ ఇండెక్స్ ఫర్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.20 లక్షలు అందించింది. సంస్థ తరపున శ్రీ రాఘవేంద్ర అన్నమయ్య భవనంలో అదనపు ఈవోకు డీడీను అందజేశారు. రాజస్థాన్కు చెందిన ఏకే ఇంజినీరింగ్ కంపెనీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10,59,000 విరాళంగా అందించింది. కాగా రెండు రోజుల క్రిందట కొనసీమ జిల్లాకి చెందిన శ్రీ దండుమేను శశాంక్ కృష్ణ రూ.10,00,006 విరాళంగా అందించారు. ఈ సందర్భంగా దాతలను అదనపు ఈవో అభినందించారు’ అని టీటీడీ తెలిపింది.
తిరుమల వెళ్లే భక్తులకు సూపర్ న్యూస్.. ఇంటర్నేషనల్ స్థాయిలో సరికొత్త అనుభూతి
శ్రీ కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 06 నుండి 09వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకోసం జూలై 06న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా జూలై 07న మొదటిరోజు ఉదయం ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం, సాయంత్రం కలశపూజ, హోమం, పవిత్ర ప్రతిష్ఠ నిర్వహిస్తారు.జూలై 08న రెండో రోజు ఉదయం గ్రంథి పవిత్ర సమర్పణ, సాయంత్రం యాగశాలపూజ, హోమం చేపడతారు. జూలై 09న ఉదయం మహాపూర్ణాహుతి, కలశోధ్వాసన, పవిత్ర సమర్పణ నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివార్లు పుర వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.