అమెరికా దాడులతో ప్రతీకారానికి దిగింది ఇరాన్. ఈ ఎటాక్కి ఇరాన్ పెట్టుకున్న పేరు ఆపరేషన్ బేషరత్ ఫతాహ్.. ఖతార్లోని అమెరికా సైనిక స్థావరంపై సోమవారం రాత్రి ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. దోహా సమీపంలోని అల్ ఉదైద్ అమెరికా ఎయిర్బేస్పై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇరాక్లోని అయిన్ అల్ అసద్ బేస్పైనా రాకెట్లు ప్రయోగించింది ఇరాన్. ఖతార్లోని ఉదైద్ ఎయిర్బేస్లో 13వేలమందిదాకా అమెరికా సైనికులు ఉంటారు. అయితే ఇరాన్పై దాడికి దిగకముందే విమానాలను అమెరికా అక్కడినుంచి తరలించిందని సమాచారం.. దాడికి కొన్ని నిమిషాలముందే ఖతార్ ప్రభుత్వానికి ఇరాన్ సమాచారం అందించింది.
ఇరాన్ ఎటాక్తో అగ్రరాజ్యం అలర్ట్ అయింది. ఈ దాడి తర్వాత సీజ్ ఫైర్ ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. సిచ్యుయేషన్ రూమ్కి వెళ్లి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు అమెరికా అధ్యక్షుడు. రెండు రోజుల క్రితం ఇరాన్పై బాంబుల వర్షం కురిపించింది అమెరికా. ఇరాన్లోని న్యూక్లియర్ స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపింది. ఇరాన్ శాంతి చర్చలకు రావడం తప్ప వేరే గత్యంతరం లేదని ట్రంప్ తేల్చి చెప్పారు. అయితే దాడికి ప్రతి దాడి తప్పదని హెచ్చరించిన ఇరాన్ రెండు రోజులకే అమెరికా ఎయిర్ బేస్లపై ఎటాక్ చేసింది. దీంతో ఇప్పుడు గల్ఫ్ దేశాలన్నీ యుద్ధ భయంతో వణికిపోతున్నాయి.
ఇరాన్ దాడులతో ఖతార్ తాత్కాలికంగా గగనతలాన్ని మూసేసింది. దేశ భద్రత విషయంలో వెనక్కి తగ్గబోమని ప్రకటించింది. అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై దాడిని ఖండించింది ఖతార్. దురాక్రమణ చర్యకు ప్రతిస్పందన ఉంటుందని ఖతార్ హెచ్చరించింది. ఇరాన్ దాడిని సౌదీ అరేబియా సైతం ఖండించింది.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య భీకరయుద్ధం సాగుతున్న సమయంలో కీలక ప్రకటన చేశారు ట్రంప్. రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం జరిగిందని తన సోషల్మీడియా ట్రూత్లో ప్రకటించారు. మరో ఆరుగంటల్లో కాల్పుల విరమణ ఒప్పందం అమలుకు చర్యలు ప్రారంభమవుతాయని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు. యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే పశ్చిమాసియా నాశనమవుతుందన్న ట్రంప్.. 12రోజుల యుద్ధానికి పలకడం మంచి పరిణామమన్నారు.
ఇప్పటిదాకా ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం. మధ్యలో అమెరికా జోక్యం. ఇప్పుడు యుద్ధ జ్వాలలు పశ్చిమాసియాలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఖతార్, ఇరాక్ అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులతో గల్ఫ్దేశాల్లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. సీజ్ఫైర్ ఒప్పందం జరిగిందని ట్రంప్ ప్రకటించినా అలాంటిదేమీ లేదంటోంది ఇరాన్. ఇజ్రాయెల్ కూడా తగ్గేదే లేదంటోంది. సోమవారం రాత్రి కూడా ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పరం భీకరదాడులకు తలపడ్డాయి. ట్రంప్ కాల్పుల విరమణను కొట్టిపారేసిన ఇరాన్.. కాల్పుల విరమణపై ఇప్పటికైతే ఎలాంటి ఒప్పందం లేదని స్పష్టంచేసింది. ఇజ్రాయెల్ దాడులు ఆపితే తామూ ఆపుతామని ఇరాన్ ఇరాన్ విదేశాంగమంత్రి క్లారిటీ ఇచ్చారు.
అయితే, ట్రంప్ ప్రకటనను తిరస్కరించిన కొద్దిసేపటికే, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి రెండు పశ్చిమాసియా శక్తుల మధ్య కాల్పుల విరమణ గురించి సూచనప్రాయంగా చెప్పారు.. చివరి నిమిషం వరకు పోరాడినందుకు ఇరాన్ సాయుధ దళాలకు కృతజ్ఞతలు తెలిపారు. “ఇజ్రాయెల్ దురాక్రమణకు శిక్షించేందుకు మన శక్తివంతమైన సాయుధ దళాల సైనిక కార్యకలాపాలు చివరి నిమిషం వరకు, ఉదయం 4 గంటల వరకు కొనసాగాయన్నారు.
దాడులపై ఇరాన్ కీలక ప్రకటన..
అమెరికా తమ అణుకేంద్రాలపై ఎన్ని బాంబులు వేసిందో అన్నే క్షిపణులతో తాము దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్లోని నతాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డో అణుకేంద్రాలపై బీ2 బాంబర్లతో ఆదివారం అమెరికా విరుచుకుపడితే.. రెండ్రోజుల్లోనే ప్రతీకారదాడికి దిగింది ఇరాన్. ముందే హెచ్చరించి మరీ అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. సైనిక స్థావరాలపై దాడులతో అమెరికా అప్రమత్తమైంది. పశ్చిమాసియాలోని తమ సైనిక స్థావరాల దగ్గర అమెరికా హైఅలర్ట్ పాటిస్తోంది.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకరయుద్ధం కొనసాగుతోంది. హైఫా, అషడోద్, టెల్ అవీవ్ నగరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. విద్యుత్కేంద్రాలు, ఇతర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంది. అటు ఇజ్రాయెల్ కూడా దూకుడు పెంచింది. 50 యుద్ధ విమానాలతో ఇరాన్లో విధ్వంసం సృష్టించింది. రాజకీయ ఖైదీలను నిర్బంధించే టెహ్రాన్ ఎవిన్ కారాగారంపైనా బాంబులేసింది ఇజ్రాయెల్. ఐడీఎఫ్ యుద్ధ విమానాలు ఇరాన్లోని 6 వైమానిక స్థావరాలపై దాడులు చేశాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి