Tirupati 1993 Plane Crash: గుజరాత్లో విమాన ప్రమాదం నేపథ్యంలో 1993లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన విమాన ప్రమాదం గుర్తుకు వస్తోంది. తిరుపతి సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని పైలట్లు చాకచక్యంగా పొలంలో ల్యాండ్ చేశారు. ఈ విమానంలో చిరంజీవి, బాలకృష్ణ, విజయశాంతి వంటి టాలీవుడ్ ప్రముఖులు 60 మందికి పైగా ఉన్నారు. ప్రమాదం జరిగినప్పటికీ అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అప్పటి సర్పంచ్ దేశిరెడ్డి ఈ ప్రమాదం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
హైలైట్:
- అహ్మదాబాద్ విమాన ప్రమాదం వేళ మరో ఘటన తెరపైకి
- తిరుపతి సమీపంలో 1993లో ఓ విమానం పొలంలో ల్యాండ్
- అదే విమానంలో ప్రయాణిస్తున్న టాలీవుడ్ సెలబ్రిటీలు
- 32 ఏళ్ల క్రితం స్టోరీని తెరపైకి తీసుకొచ్చిన తెలుగు జర్నలిస్ట్

1993లో జరిగిన ఈ విమాన ప్రమాద సమయంలో.. అక్కడే ఉన్న దేశిరెడ్డి అనే 85 ఏళ్ల వయసున్న పెద్దాయనను జర్నలిస్ట్ కార్తీక్ కలిశారు..ఆయన పేరు దేశిరెడ్డి, 1993లో శ్రీకాళహస్తి మండలం గుండ్లపల్లె సర్పంచ్గా పనిచేశారట. 85 ఏళ్ల అయినా సరే ఇప్పటికి చాలా యాక్టివ్.. పొలం పనులు చేసుకుంటున్నారట. ‘1993లో.. అంటే 32 ఏళ్ల క్రితం గుండ్లపల్లి సమీపంలో ఓ విమానం ఆకాశం నుంచి నేలకు ఒరిగింది. అందులో 272మంది ప్రయాణిస్తున్నారు.. ఇంత ప్రమాదం జరిగినా ప్రయాణికులకు చిన్న, చిన్న గాయాలు మినహా ఎవరికి ఏమీ కాలేదు.. ఈ ప్రమాదం చరిత్రలో నిలిచిపోయింది. ఆ విమానంలో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి సెలబ్రిటీలు కూడా ఉన్నారు. చిరంజీవి, బాలకృష్ణ, విజయశాంతి సహా 60 మందిపైగా సినీ ప్రముఖులు వాళ్ల కుటుంబాలతో ప్రయాణిస్తున్నారు. 1993 నవంబర్ 15న ఈ ప్రమాదం జరిగింది’ అని దేశిరెడ్డి తాతో చర్చించిన కార్తీక్ తెలుసుకున్నారట.
‘ఈ విమానం మద్రాసు ఎయిర్పోర్టు నుంచి ఇండియన్ ఎయిర్లైన్స్ 440 ఎయిర్బస్ 272 మంది ప్రయాణికులతో ఉదయం 6 గంటల 20 నిమిషాలకు హైదరాబాద్కు బయల్దేరింది. ఈ విమానం కాక్పిట్లో సీనియర్ పైలెట్ కెప్టెన్ భల్లా, కో పైలెట్ వేల్రాజ్ ఉన్నారు. ఆ రోజు విమానంలో చిరంజీవి, బాలకృష్ణ, విజయశాంతి, అల్లు రామలింగయ్య దంపతులు, మాలాశ్రీ, కమెడియన్ సుధాకర్, కాస్ట్యూమ్స్ కృష్ణ, దర్శకులు కోడి రామకృష్ణ, ఎస్వీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి నారాయణరావు, బాపు, రచయితలు పరుచూరి వెంకటేశ్వరరావు, ఎండి.సుందరం, నిర్మాతలు కె.సి.శేఖర్బాబు, కాట్రగడ్డ ప్రసాద్, రాశీ మూవీస్ నరసింహారావు, నృత్య దర్శకురాలు సుచిత్ర, ఫైట్ మాస్టర్ సూపర్ సుబ్బరాయన్, ఛాయాగ్రాహకులు కె.ఎస్.హరి, అనుమోలు హరి, చిరంజీవి పర్సనల్ మేకప్మన్ శివ, ఇంకా ఎంతో మంది సాంకేతిక నిపుణులు ప్రయాణిస్తున్నారు’ అని వివరించారు.
‘ఈ విమానంలో ఉన్నది ఎక్కువ మంది సినిమా వాళ్లే కావడంతో అందరూ పలకరించుకుంటూ జోక్స్, నవ్వులతో విమానంలో సందడి వాతావరణం ఉంది. ఈ విమానం మద్రాసులో ఉదయం 6.20 గంటలకు బయల్దేరింది.. 7 గంటల కల్లా విమానం బేగంపేట విమానాశ్రయం చేరుకుంది. అయితే ఫ్లైట్ కొద్దిసేపట్లో ల్యాండవుతుంది అనుకున్న సమయంలో ఎయిర్పోర్ట్లో దట్టంగా మంచు కమ్ముకోవడంతో రన్ వే కనిపించడం లేదని పైలెట్లు చెప్పారు. అందుకే మళ్లీ విమానాన్ని మద్రాసుకు తీసుకెళుతున్నామని ఎయిర్హోస్టెస్ ప్రయాణికులకు తెలిపింది. అయితే ఫ్లాప్ల సమస్య కారణంగా విమానం తక్కువ వేగంతో, తక్కువ ఎత్తులో ప్రయాణించాల్సి వచ్చింది. ఈ ప్రభావంతో ఇంధనం తగ్గిపోయింది.. మద్రాస్కు డైవర్ట్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ, ఇంధనం అయిపోవడంతో తిరుపతి విమానాశ్రయానికి 14 నాటికల్ మైళ్ల దూరంలో ఒక పొలంలో బెల్లీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది’ అన్నారు.’ఈ విమానంలోని 272 మంది ప్రయాణికులు, సిబ్బంది సజీవంగా బయటపడ్డారు.. కొందరికి చిన్న, చిన్న గాయాలు అయ్యాయి. విమానం పొలాల్లో ల్యాండ్ అవడంతో బురద నీళ్లు విమానంలోకి వచ్చేశాయి. ఆ బురదలోనే ఈదుకుంటూ ప్రయాణికులు బయటకు దూకేశారు. మోకాళ్ల లోతు బురదలో అర కిలో మీటర్ దూరం వరకూ అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి సురక్షిత ప్రాంతానికి చేరుకొన్నారు. ఆరోజు ఉదయం పొలానికి వెళ్తున్న సమయంలో దేశిరెడ్డి భారీ శబ్దం విన్నారు. అప్పుడు అది విమానమని తెలియదు, వెంటనే అక్కడికి పరుగున వెళ్లారు. విమానం పొలాల్లో ల్యాండ్ అయింది.. దాదాపు అర కిలోమీటరు మేర భూమిపై రాసుకుంటు వెళ్లింది. కానీ మమల్ని దగ్గరకు రానివ్వలేదు.. అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పారు. మా ఊరిలో చెరువును, ఓ కొండను తప్పించి విమానం ల్యాండ్ అయింది. ఒకవేళ చెరువు గట్టుకు తగిలిన, చిన్న కొండను ఢీకొట్టి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ప్రయాణికుల్ని మేము గట్టుమీదకు తీసుకొచ్చామ. విమానం ల్యాండ్ అయ్యాక పైలెట్ కిందకు దిగి ఓ చెట్టు దెగ్గరకు పరుగులు తీసి ఒణుకుతూ నిల్చున్నారు. తరువాత విమానంలో ఒక్కొకరుగా కిందకు దిగారు. విమానంలో అప్పటి సీఎం మర్రిచెన్నా రెడ్డి కుమార్తె, మనవరాలు ఉన్నారు. సీఎం మర్రిచెన్నారెడ్డి హెలికాప్టర్లో ప్రమాద ప్రాంతానికి వచ్చారు. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో విమాన విడి భాగాలు ఊడిపోయాయి’ అన్నారట దేశిరెడ్డి.
విమాన ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ చిరంజీవి, బాలయ్య.. 32 ఏళ్ల క్రితం ఇచ్చిన మాట తప్పారా..?
‘ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, అల్లూరామలింగయ్యతో సహా అందరూ షాకయ్యారు. వాళ్లందరికీ తాగేందుకు మజ్జిగ, నీరు ఇచ్చాను. అల్లురామలింగయ్య చాలా భయపడ్డారు.. ఏమి కాలేదు బయపడకండి అని దేశిరెడ్డి ధైర్యం చెప్పాను. మా ఊరి ప్రజలు విమానంలో ఉన్నవారికి సహాయం చేశారు. అయితే మీ ఊరు మమ్మల్ని కాపాడింది మీకు ఏమైనా చేస్తామని చిరంజీవి బాలకృష్ణ అడిగితే హాస్పిటల్ కట్టించాలని కోరారట దేశిరెడ్డి తాత. వాళ్ళు హామీ ఇచ్చారని.. కానీ నెరవేర్చలేదన్నారు దేశిరెడ్డి తాత. అహ్మదాబాద్ విమానం ప్రమాదం గురించి తెలిసి దేశిరెడ్డి 1993లో జరిగిన విమాన ప్రమాదాన్ని గుర్తు చేసుకున్నారు. అహ్మదాబాద్ ప్రమాదం చూసిన తర్వాత గ్రామంలో జరిగిన విమాన ఘటన తాలూకు అనుభవాలను గుర్తు చేసుకుంటూనే అప్పటి విడిభాగాలను కూడా కొంతమంది బయటకు తీసి చూసుకుంటూ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు’ అని జర్నలిస్ట్ కార్తీక్ దేశిరెడ్డి తాతను కలిసిన అనుభవాన్ని అందరితో పంచుకున్నారు.
జర్నలిస్ట్ కార్తీక్ పోస్ట్కు మరో జర్నలిస్ట్ పీవీ రవికుమార్ కూడా స్పందించారు.. ‘నేను రిపోర్టర్గా తిరుపతి నుంచి వెళ్లి ఆ News కవర్ చేసిన అవకాశం నాకు కూడా లభించింది.. అందులో వెంకటేష్ లేడు.. చిరంజీవి, బాలకృష్ణ.. విజయశాంతి, అల్లు తదితరులున్నారు.. ఆ రోజు కెప్టెన్ భల్లా తరువాత ధైర్యం గా ఉన్నవ్యక్తి, అందరికీ ధైర్యం చెప్పిన దీశాలి బాలకృష్ణ మాత్రమే.. బురదలో దిగిన విమానం నుంచి అందరినీ ట్రాక్టర్ లో రోడ్డు వరకు తెచ్చారు.. అదొక మరచిపోలేని అనుభవం’ అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు.