అద్భుతమైన ఆఫర్లు, ఆకర్షణీయమైన బహుమతులుంటాయని నమ్మించి అమాయక ప్రజలకు కేటుగాళ్లు కుచ్చుటోపీ పెట్టారు. లక్కీ డ్రా పేరిట ప్రజల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన కొందరు చివరకు బోర్డు తిప్పేశారు. నమ్మించి నట్టేట ముంచి మోసాలకు పాల్పడుతున్నారు. వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన రమేశ్, కోటేశ్వరరావు, శ్రీనివాస్ 2023 అక్టోబర్లో ఆర్కే ఎంటర్ప్రైజెస్ పేరుతో సంస్థను ప్రారంభించారు. అద్భుతమైన ఆఫర్లు, ఆకర్షణీయమైన బహుమతులుంటాయని లక్కీ డ్రా పేరుతో దందా ప్రారంభించారు. అందరినీ రిజిస్ట్రేషన్ చేయించడం ప్రారంభించారు. వారి వ్యాపారాన్ని పెంచుకునేందుకు ఏజెంట్లను కూడా నియమించుకున్నారు.
మిర్యాలగూడతో పాటు సూర్యాపేట జిల్లా గరిడేపల్లి, నేరేడుచర్ల, హైదరాబాద్ ఏపీలోని పలు ప్రాంతాల్లోనూ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని 2,600 మంది సభ్యులను చేర్చుకున్నారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ. వెయ్యి చొప్పున 15 నెలల పాటు రూ.15వేలు చెల్లించాలి. సభ్యులందరికీ ప్రతి నెలా ఐదవ తేదీన లక్కీ డ్రా తీసి 10 మంది విజేతలకు బహుమతులు అందిస్తామని చెప్పారు. చివరి వరకు డ్రాలో విజేతలుగా ఎంపిక కాని వారికి.. వారు చెల్లించిన రూ.15 వేలకు సమానమైన కార్లు, బైక్లు, బంగారం, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్, సోఫా, బెడ్స్ వంటి బహుమతులు అందిస్తామని ప్రకటించారు.

Offer Crime News
గతేడాది అక్టోబర్లో ప్రారంభమైన ఈ లక్కీ డ్రా స్కీం ఈ ఏడాది జనవరిలో ముగిసింది. ఇప్పటి వరకు 150మందికి డ్రా పద్ధతిలో వస్తువులు అందజేసిన నిర్వాహకులు ఆ తర్వాత స్కీంను అర్ధాంతరంగా ఎత్తివేశారు. గత ఆరునెలలుగా నిర్వాహకులు పత్తా లేకపోవడంతో స్కీంలో చేరిన సభ్యులు వారి కోసం ఆరా తీశారు. వారిని సభ్యులుగా చేర్పించిన ఏజెంట్లను నిలదీయడంతో తాము మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. ఒక్క మిర్యాలగూడ పట్టణంలోనే 900 మంది బాధితులున్నారు.
స్కీంలో చెప్పిన విధంగా చెల్లింపులు చేయకపోవడం, బంపర్ డ్రా తీయకపోవడంతో మిర్యాలగూడ పట్టణం కల్వాడకు చెందిన మొరుగు వెంకటమ్మ అనే మహిళ తనను సభ్యురాలిగా చేర్పిన మందారి మల్లేశ్వరి, స్కీం నిర్వాహకుడు కె. రమేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మోతీ రామ్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..