ఏపీలోని గుంటూరులో దారుణం చోటుచేసుకుంది. డబ్బు నగల కోసం ఓ ముఠా దారుణాలకు పాల్పడింది.. మూడు హత్యలు చేసి.. ఏం తెలియనట్లు నటిస్తున్న ముగ్గురిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.. సీసీ ఫుటేజీ సహాయంతో ట్రిపుల్ మర్డర్ కేసులను చేధించారు. వివరాల ప్రకారం.. తెనాలిలోని మారీస్ పేటకు చెందిన కుసుమకుమారి ఇంటికి సమీపంలోనే సుభాషిణి అనే డెభ్బై ఏళ్ల వృద్దురాలు నివసించేది. ఆమె పిల్లలు ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఈక్రమంలో తమ తల్లి బాగోగులు చూసుకోమని కుసుమ కుమారికి చెప్పారు. అయితే కుసుమ కుమారికి సుభాషిణి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలపై కన్నుపడింది. మే 25వ తేదిని తనకు తెలిసిన ఆటో డ్రైవర్ గోపిక్రిష్ణ ను సుభాషిణి ఇంటికి రమ్మని కుసుమ కుమారి చెప్పింది. గోపిక్రిష్ణ గోడ దూకి సుభాషిణి ఇంటిలోకి వెళ్లాడు. అప్పటికే అక్కడే ఉన్న కుసుమకుమారి గోపిక్రిష్ణ సాయంతో సుభాషిణిని గొంతు నులిమి చంపేసి ఆమె ఇంటి మీద ఉన్న బంగారు ఆభరణాలు తీసుకొని పారిపోయారు. కొద్దీ సేపటి తర్వాత సుభాషిణి కుమార్తె ఫోన్ చేయగా ఆమె తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన కుమార్తె.. కుసుమ కుమారికి ఫోన్ చేసి ఏం జరిగిందో చూడాలని చెప్పింది. దీంతో కుసుమ కుమారి తన ఇంటి పక్కల వారిని తీసుకొని సుభాషిణి ఇంటికి వెళ్లింది. అయితే, ఆమె చనిపోయి ఉండటంతో ఈ విషయాన్ని కుమార్తెకు చెప్పింది.
ముఖంపై గాయాలుండటం, బంగారు ఆభరణాలు మాయం కావడంతో అనుమానం వచ్చింది.. అయితే.. కేసులు, గొడవలు ఎందుకులే అని పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి వచ్చిన నగలను వారు పంచుకున్నారు. ఈ కేసు బయటకు రాకపోవడంతో కుసుమ కుమారి గ్యాంగ్ మరోకరి హత్యకు ప్లాన్ వేశారు. అక్కడికి సమీపంలో ఉన్న ఒంటరి మహిళ ఇంటి వద్ద రెక్కి నిర్వహించారు. అయితే ఆ ఇంటికి నలువైపులా సిసి కెమెరాలుండటంతో హత్య ప్లాన్ను విరమించుకున్నారు.
ఆ తర్వాత కుసుమకుమారి తనకు పరిచయం ఉన్న రాజేశ్వరి, అంజమ్మలపై కన్నేసింది. వారి ఇంటిపై గది ఖాళీగా ఉండటంతో ఆ గది అద్దెకు తీసుకునే పేరుతో వారి ఇంటి వద్దకు వెళ్లి వారిని చంపే విధంగా ప్లాన్ వేసింది. ఇందు కోసం ఈ నెల పద్దెనిమిదో తేదిన రాజేశ్వరి ఇంటి వద్దకు వెళ్లారు. అయితే జనసంచారం అధికంగా ఉండటంతో వెనుదిరిగివచ్చారు. మరొసటి రోజు మరొక సారి రాజేశ్వరి ఇంటికి వెళ్లారు. ఆమెపై అంతస్థులోకి వెళ్లి గది చూపించిన తర్వాత.. గోపిక్రిష్ణ, కుసుమ కుమారి మరొక మైనర్ బాలుడితో కలిసి వారిద్దరి హత్య చేసి వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు తీసుకొని పారిపోయారు.
అయితే రాజేశ్వరి ఇంటిలో సిసి కెమెరాలున్న విషయాన్ని నిందితులు పసిగట్టలేకపోయారు. అదే సమయంలో సిసి కెమెరాలను వారి కుమార్తె తన ఫోన్ కు అనుసంధానం చేసుకోవడంతో ఎవరూ ముగ్గురు వచ్చి వెళ్లినట్లు వారి కుమార్తె పోలీసులకు చెప్పింది. సిసి కెమెరా విజువల్స్ సాయంతో ముగ్గురి గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. సిసి కెమెరా విజువల్స్ లేకుంటే ఎంతోమంది ప్రాణాలను ముఠా హరించేదని స్థానికులు అంటున్నారు. కుసుమకుమారి, గోపిక్రిష్ణలతో పాటు మరొక మైనర్ బాలుడు కూడా ఈ హత్యల్లో పాలు పంచుకోవడం కలకలం రేపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..