Bullets and Bombs in Srisailam: శ్రీశైలంలో బాంబులు, బుల్లెట్లు కలకలం రేపాయి. ఆలయం సమీపంలో సోమవారం బుల్లెట్లు, బాంబులతో ఉన్న సంచి కనిపించడం కలకలం రేపింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ బాంబులు, బుల్లెట్లు ఎవరివి.. ఎక్కడికి అలా వచ్చాయనే దానిపై దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. దీనికి సంబంధించిన వివరాలను ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్ సోమవారం రాత్రి వెల్లడించారు.

అసలేం జరిగింది.. ఎలా అక్కడకు వచ్చాయి?
శ్రీశైలం ఆలయం సమీపంలో సోమవారం బుల్లెట్లు, బాంబులు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. శ్రీశైలంలోని వాసవీ సత్రం ఎదురుగా ఉండే రోడ్డు డివైడర్ మీద ఉన్న మొక్కల మధ్యలో సోమవారం ఓ సంచి కనిపించింది. కూలీలు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు చేరవేశారు. పోలీసులు బాంబ్ స్క్వాడ్తో పాటుగా ఘటనాస్థలికి చేరుకుని.. ఆ సంచిని స్వాధీనం చేసుకున్నారు. అందులో బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. అలాగే వంకాయ బాంబుల తరహాలో ఉన్నవి 4 సంచిలో లభించాయి. వీటితో పాటుగా ఒక ఎర్రటి వస్త్రం దొరికింది. పోలీసులు వీటిని స్వాధీనం చేసుకుని పోలీసుస్టేషన్కు తరలించారు.
ఎలా వచ్చాయంటే?
1983 బ్యాచ్కు చెందిన ఎల్లప్ప అనే పోలీసుకు.. అధికారులు శ్రీశైలంలో విధులు అప్పగించారు. అయితే ఎల్లప్ప తనకు కేటాయించిన బుల్లెట్లను సంచిలో వేసుకుని శ్రీశైలం చేరుకున్నారు. రోడ్డు డివైడర్ వద్ద ఫోన్ మాట్లాడుతూ ఎల్లప్ప ఆ సంచిని డివైడర్ మధ్యలో మర్చిపోయినట్లు డీఎస్పీ వివరించారు. అయితే ఎల్లప్ప భయపడిపోయి ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారని వివరించారు. ఎల్లప్ప జూన్ ఆఖర్లో రిటైర్ అవుతున్నట్లు డీఎస్పీ వివరించారు. ఎల్లప్పకు జాతకాల పిచ్చి ఎక్కువని.. అందుకే ఆ సంచిలో ఎర్రటి వస్త్రాన్ని ఉంచారన్నారు. ఎస్.ఎల్.ఆర్, 303, పిస్టల్కు సంబంధించిన రౌండ్లు సంచిలో ఉన్నాయన్న డీఎస్పీ.. అవన్నీ పోలీసు శాఖకు చెందినవేనని వివరించారు. బ్యాగులో ఉన్న బాంబులు బాణసంచా బాంబులని డీఎస్పీ వివరించారు.