మోటారు సైకిళ్లను ఇష్టపడే వారందరికీ హార్లే డేవిడ్సన్ బైక్ లు సుపరిచితమే. సాధారణ బైక్ లతో పోల్చితే వీటి ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీంతో చాలామంది రైడర్లు తమ జీవితంలో ఒక్కసారైనా వాటిని నడపాలని కోరుకుంటారు. డిజైన్, లుక్, సామర్థ్యం, నాణ్యత పరంగా హార్లే డేవిడ్సన్ బైక్ లు ఎప్పుడూ ముందు స్థానంలో ఉంటాయి. వీటిపై కూర్చుని డ్రైవింగ్ చేస్తుంటే ఒకరకమైన రాజసం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ కంపెనీ తన 2025 మోడళ్లను అధికారికంగా విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న షోరూమ్ లలో ప్రీ బుకింగ్ లు కూడా మొదలయ్యాయి.
ప్రముఖ టూ వీలర్ కంపెనీ హీరో మోటాకార్ప్ తో హార్లే డేవిడ్సన్ కు భాగస్వామ్యం కొనసాగుతోంది. ప్రస్తుతం మన దేశంలో విడుదల చేయనున్న వాహనాలపై మార్కెట్ లో ఆసక్తి నెలకొంది. వీటిలో ఎంట్రి లెవల్ అయిన ఎక్స్ 440 ధరను రూ.2.39 లక్షలుగా నిర్దారణ చేశారు. ఇక 2025 మోడళ్లలకు సంబంధించి నైట్ స్టర్ రూ.13.51 లక్షలు, నైట్ స్టర్ స్పెషన్ రూ.14.29 లక్షలు, స్పోర్ట్ స్టర్ ఎస్ రూ.16.70 లక్షలు పలుకుతున్నాయి. హెరిటేజ్ క్లాసిక్ రూ.23.85 లక్షలు, ఫ్యాట్ బోయ్ రూ.25.90 లక్షలు, పాన్ అమెరికా స్పెషల్ రూ.25.10 లక్షలు, బ్రేక్ అవుట్ రూ.37.19 లక్షలుగా ప్రకటించారు. ఇక సీవీవో మోడల్స్ లోని స్ట్రీట్ గ్లైడ్, రోడ్ గ్లైడ్ లను త్వరలోనే ప్రారంభించనున్నారు. వాటి ధరలు కూడా వెల్లడించాల్సి ఉంది.
హార్లే డేవిడ్సన్ తన కొత్త లైనప్ మోడళ్లను అనేక అనేక ప్రత్యేకతలతో తీసుకువచ్చింది. ముఖ్యంగా డిజైన్ ను చాాలా ఆకర్షణీయంగా రూపొందించింది. పాత లైనప్ కు కొన్ని మార్పులు చేసి ఆధునాతనంగా మార్పులు చేసింది. ఇంజిన్, లుక్, టెక్నాలజీలపై శ్రద్ద చూపింది. రైడర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు, డ్రైవింగ్ సులభం చేసేందుకు కొత్త టెక్ ఫీచర్లను తీసుకువచ్చింది. ఈ కొత్త బైక్ లపై మార్కెట్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ తరహా మోడళ్లకు మన దేశంలో ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో హార్లే డేవిడ్సస్ మార్కెట్ లో ఇతర వాహనాలకు మంచి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి