తిరుమలలో మరో వివాదం తెరపైకి వచ్చింది. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల్లో చాలా మంది కొండపై ఉన్న వేణుగోపాల స్వామిని కూడా దర్శించుకుంటారు. అయితే, వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్లే భక్తులు.. స్వామివారిని దర్శించుకోవాలంటే మాత్రం రూ.5 ఛార్జీలు చెల్లించి టికెట్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఈ విషయంపై విజయకుమార స్వామి అనే సాధువు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వీడియోలు విడుదల చేశారు. స్వామివారి ఉచిత దర్శనానికి కూడా 5 రూపాయల టికెట్ ఎందుకు చెల్లించాలని.. ఇలాంటి పద్ధతి దేశంలోని ఏ ఆలయంలో లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధర్మాన్ని కాపాడతామని చెప్పే టీటీడీ అధికారులు వెంటనే ఈ ఆలయంలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మాన్ని కాపాడతానని చెప్పే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంపై స్పందించాలని కోరారు. తిరుమల వేణుగోపాలస్వామి ఆలయంలో టిక్కెట్ డబ్బుల వసూళ్లను రద్దు చేసి.. భక్తులకు ఉచితంగా దర్శనానికి అనుమతించాలని కోరారు.