అంతరిక్షమిషన్ కోసం ఎంపికైన తెలుగు అమ్మాయి జాహ్నవి దంగేటికి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ జాహ్నవిని అభినందించారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. మరోవైపు గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జాహ్నవి కుటుంబసభ్యులతో కలిసి ఆయనను కలిశారు. తన ట్రైనింగ్ కోసం ప్రోత్సాహం అందించాలని కోరారు.

జాహ్నవి దంగేటి. మన పాలకొల్లు అమ్మాయే.. ఇప్పుడు దేశం మొత్తం ఈమె పేరు మార్మోగిపోతోంది. జాహ్నవి దంగేటి (21) ఇప్పుడు అంతరిక్షంలోకి అడుగుపెట్టే అరుదైన, అద్భుతమైన అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. నాసా అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ విజయవంతంగా పూర్తి చేసిన జాహ్వని దంగేటి.. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్గా గుర్తింపు సంపాదించుకున్నారు. తాజాగా దంగేటి జాహ్నవి టైటాన్ స్పేస్ మిషన్ కోసం ఎంపికయ్యారు. అమెరికన్ ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్.. టైటాన్ స్పేస్ మిషన్ను 2029లో చేపట్టనుంది. ఈ మిషన్ కోసం ఆస్ట్రోనాట్ కాండిడేట్గా జాహ్నవి ఎంపికయ్యారు.
జాహ్నవి దంగేటి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు. ఆమె తల్లిదండ్రులు శ్రీనివాస్, పద్మశ్రీ కువైట్లో ఉద్యోగం చేస్తున్నారు. దీంతో జాహ్నవి పాలకొల్లులోని అమ్మమ్మ దగ్గరే పెరిగారు. పాలకొల్లులోనే ఇంటర్ పూర్తి చేశారు. ఆ తర్వాత పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో డిగ్రీ పూర్తి చేశారు. ఏపీలోని చిన్న పట్టణం నుంచి అంతర్జాతీయ స్థాయికి జాహ్నవి దంగేటి ఎదిగిన తీరు.. యువతకు ఆదర్శప్రాయం. అలాగే అంతర్జాతీయ స్పేస్ రంగంలో భారతదేశం ఎదుగుతున్న తీరుకు నిదర్శనం.
మరోవైపు జాహ్నవి దంగేటిని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ ASCAN ప్రోగ్రామ్ కోసం ఆస్ట్రోనాట్ కేండిడేట్గా ఎంపికైనందుకు ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలియజేశారు. దంగేటి జాహ్నవి ప్రతిభ ప్రతి భారతీయుడిని, ప్రతి ఆంధ్రుడిని గర్వపడేలా చేస్తుంది. ఆమె ప్రయాణం విజయవంతంగా ముందుకు సాగాలని.. ఎంతో మంది యవత పెద్ద కలలు కనేలా స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నా.. అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
మరోపైపు జాహ్నవి దంగేటి గతంలోనూ వైఎస్ జగన్ను కలిశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జాహ్నవి కుటుంబసభ్యులతో కలిసి ఆయనను కలిశారు. నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్పూర్తి చేసిన అనంతరం.. రాజమండ్రి ఆర్అండ్బీ అతిథి గృహంలో కుటుంబంతో కలిసి జగన్ను కలిశారు జాహ్నవి. ఆస్ట్రోనాట్ కావాలనే తన కోరికను వివరించి.. ట్రైనింగ్ కోసం సాయం చేయాలని జగన్కు విజ్ఞప్తి చేశారు. దీనికి వైఎస్ జగన్ కూడా సానుకూలంగా స్పందించి.. ఆమెకు ప్రోత్సాహం అందించారు.