పొగాకు రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. బ్లాక్ బర్లీ పొగాకును రైతుల నుంచి మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. అయితే ఇప్పటి వరకూ కొనుగోలు చేసిన పొగాకుకు గానూ రైతులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. పొగాకు రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రూ.273 కోట్లు విడుదల చేసినట్లు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతగా పేర్కొన్నారు.

మరోవైపు కొనేవారు లేక కష్టాల్లో కూరుకుపోయిన పొగాకు రైతులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం మార్క్ఫెడ్ సాయంతో బ్లాక్ బర్లీ పొగాకు ను కొనుగోలు చేసింది. కొనుగోలు కేంద్రాల ద్వారా పొగాకును కొనుగోలు చేసింది. బ్లాక్ బర్లీ పొగాకు ఎక్కువగా గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో సాగవుతోంది. రెండేళ్లుగా బ్లాక్ బర్లీ పొగాకు ధర అధికంగా ఉండటంతో.. ఈ సారి రైతులు ఎక్కువ విస్తీర్ణంలో బ్లాక్ బర్లీ రకం పొగాకు సాగు చేశారు. దీంతో సుమారుగా100 మిలియన్ కిలోల ఉత్పత్తి అయింది.
అయితే కంపెనీలు కొనుగోలు చేయకుండా మొహం చాటేశాయి. ఉత్పత్తి అయిన పొగాకులో కంపెనీలు కేవలం 20 శాతంలోపే కొనుగోలు చేయడంతో పొగాకు రైతులు రోడ్డెక్కారు. దీంతో వీరిని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మార్క్ఫెడ్ ద్వారా ఏడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి బ్లాక్ బర్లీ పొగాకును కొనుగోలు చేస్తోంది.
ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. అకౌంట్లలోకి డబ్బులు పడ్డాయ్..
మంచి క్వాలిటీ ఉన్న బ్లాక్ బర్లీ పొగాకును కిలోకు రూ.120, లోక్వాలిటీ రకానికి రూ.60 కనీస ధరగా నిర్ణయించారు. యావరేజ్ క్వాలిటీ ఉన్న బ్లాక్ బర్లీ పొగాకు కేజీ. రూ.90గా కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకూ కొనుగోలు చేసిన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నగదు జమ చేసింది. సుమారుగా రూ.273 కోట్లు రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి విడుదల చేసింది.