Andhra Pradesh Building Rules 2025: పేదల సొంతింటి కలను నిజం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పట్టణాల్లో 50 చదరపు మీటర్లలో ఇల్లు కట్టుకునే పేదలకు రూపాయికే అనుమతులు లభిస్తాయి. అంతేకాదు, భవనాల నిర్మాణంలో సెట్బ్యాక్లకు సంబంధించి వెసులుబాట్లు కల్పించడంతో పాటు 9 మీటర్ల వెడల్పు ఉన్న రోడ్లలో పరిశ్రమలు పెట్టుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పేదలకు ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది.
హైలైట్:
- ఆంధ్రప్రదేశ్లో పేదలకు పండగే
- ఇకపై రూపాయికే అనుమతి ఇస్తారు
- ప్రభుత్వ ఆఫీస్ల చుట్టూ తిరగక్కర్లేదు

భవనాల చుట్టూ ఖాళీ స్థలం (సెట్బ్యాక్) విషయంలో కూడా కొన్ని మార్పులు చేశారు. 100 చదరపు మీటర్ల లోపు స్థలం ఉంటే సెట్బ్యాక్ అవసరం లేదు. అంటే, ఇంటి చుట్టూ ఖాళీ స్థలం వదలాల్సిన పనిలేదు. 100 నుంచి 500 చదరపు మీటర్ల స్థలం ఉంటే ముందువైపు 1 మీటరు నుంచి 3 మీటర్ల వరకు, మిగిలిన మూడు వైపులా 0.75 మీటర్ల నుంచి 2 మీటర్ల వరకు ఖాళీ స్థలం వదలాలి. 500 నుంచి 2,500 చదరపు మీటర్ల స్థలం ఉంటే ముందువైపు 3 మీటర్ల నుంచి 5.5 మీటర్ల వరకు ఖాళీ స్థలం వదలాలి. అయితే మిగిలిన మూడు వైపులా పాత నిబంధనలే వర్తిస్తాయని క్లారిటీ ఇచ్చారు. 2,500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ స్థలం ఉంటే కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. ఈ మార్పుల వల్ల ఎక్కువ స్థలంలో ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది.
ఏపీలో పేదలకు గుడ్న్యూస్.. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగక్కర్లేదు, జస్ట్ రూపాయి కడితే చాలు!
ఈ సడలింపుల వల్ల నిర్మాణాల్లో నిబంధనలు ఉల్లంఘించే అవకాశం ఉండదని ప్రభుత్వం చెబుతోంది. దీనివల్ల బిల్టప్ ఏరియా పెరుగుతుంది. అంటే, ఎక్కువ స్థలంలో నిర్మాణం చేసుకోవచ్చు. 300 చదరపు మీటర్ల కంటే ఎక్కువ స్థలంలో ఇల్లు కడితే సెల్లార్ పార్కింగ్కు అనుమతిస్తారు. అంతేకాదు సెట్బ్యాక్ను కూడా మార్చుకునే అవకాశం ఉంది. అలాగే ప్రతి భవనంలో తడి, పొడి వ్యర్థాల నిర్వహణ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. అలాగే రోడ్డు విస్తరణలో స్థలం కోల్పోతే టీడీఆర్ బాండ్లు ఇచ్చేలోపు కొంత స్థలంలో నిర్మాణాలు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. చిన్న ప్లాట్లకు రోడ్డు విషయంలో సడలింపులు ఇచ్చారు. సెక్యూరిటీ పోస్ట్, బిల్డింగ్, సెట్బ్యాక్ ప్రాంతంలో ఎస్టీపీ, ఈటీపీ ఏర్పాటుకు కూడా అనుమతి ఉంది. 3 మీటర్ల ఎత్తు దాటిన భవనాలకు బాల్కనీలు 1.5 మీటర్ల వెడల్పుతో నిర్మించుకోవచ్చు. అన్ని రకాల భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్లు, హోటల్స్, గవర్నమెంట్ కాంప్లెక్స్లలో సీసీ కెమెరాలు తప్పనిసరి చేశారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్నా ఈ నిర్ణయాల వల్ల పేదలకు ఇల్లు కట్టుకోవడం సులభం అవుతుందని.. అలాగే, పరిశ్రమలు స్థాపించేందుకు కూడా అవకాశం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.