Nara Lokesh Serious On Parvathipuram Incident: పార్వతీపురం మన్యం జిల్లాలో పాఠశాలల వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఒక పాఠశాలను మోడల్ స్కూల్గా మార్చడం, మరో పాఠశాల మూసివేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టారు. కలెక్టర్ కార్యాలయానికి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. రాజకీయ పార్టీలు పాఠశాలల జోలికి రావద్దని మంత్రి లోకేష్ హెచ్చరించారు.
హైలైట్:
- పార్వతీపురం స్కూల్ విద్యార్థుల ఘటన
- సామాన్యుడి ట్వీట్కు స్పందించిన లోకేష్
- విచారణకు ఆదేశించిన ఏపీ మంత్రి

ఈ విషయాన్ని ఓ నెటిజన్ ట్వీట్ చేసి.. మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. ‘గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, పార్వతీపురం మన్యం జిల్లా, పార్వతీపురం నియోజకవర్గం,బలిజిపేట మండలం పెద్దపెంకి గ్రామంలోని MPP స్కూల్లో జరిగిన ఒక ఆందోళనకర సంఘటన గురించి మీ దృష్టికి తీసుకొస్తున్నాను.నిన్న, స్కూల్ యూనిఫామ్లో ఉన్న విద్యార్థులను మాజీ MLA జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిరసనకు తీసుకెళ్లారు. షాకింగ్గా, MEO మరియు HM ఈ రాజకీయ నిరసనకు విద్యార్థులను అనుమతించారు.తిరిగి వస్తుండగా జరిగిన ఒక దుర్ఘటనలో ఏడుగురు విద్యార్థులు గాయపడి ఆసుపత్రిలో చేరారు. వీరిలో ఇద్దరి పరిస్థితి సీరియస్గా ఉంది.MEO మరియు HM బాధ్యతారహిత ప్రవర్తనపై తీవ్ర ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విద్యార్థుల భద్రతను పణంగా పెట్టి, స్కూల్ సమయంలో రాజకీయ నిరసనకు అనుమతించడం చట్ట విరుద్ధం. ఈ సంఘటనను వెంటనే విచారణ జరిపి బాధ్యులైన MEO మరియు HMపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. విద్యార్థుల భద్రతతో రాజీ పడే ఇటువంటి నిర్లక్ష్యాన్ని సహించలేము.త్వరగా తగిన చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాను’ అంటూ ఫిర్యాదు చేశారు.
సామాన్యుడి ట్వీట్.. వాళ్ల జోలికి పోవద్దంటూ మంత్రి నారా లోకేష్ సీరియస్
ఈ ఫిర్యాదుపై మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. ‘ఇది చాలా దారుణం, నేరం కూడా..! దీనిపై అర్జెంటుగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తున్నాను. గాయపడిన పిల్లలు, తల్లిదండ్రులకు మెరుగైన చికిత్స అందిస్తాం. పాఠశాలల్లో దురదృష్టకరమైన ఈ జోక్యం రాజకీయ పార్టీల నేతలు- అధికారులకు హెచ్చరిక కావాలి. ఏ రాజకీయ పార్టీ అయినా దయచేసి మీ స్వప్రయోజనాల కోసం పాఠశాలల జోలికి పోవద్దు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు. బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తాం’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.