Chandrababu Write Letter On National Highway 65: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఈ విస్తరణను గొల్లపూడి వరకు చేయాలని చంద్రబాబు కోరారు. NHAI మాత్రం కంచికచర్ల వరకే పరిమితం చేయాలని చూస్తోంది. దీనిపై చంద్రబాబు గడ్కరీకి లేఖ రాశారు. విజయవాడ-మచిలీపట్నం హైవేను కానూరు నుంచే ఆరు వరుసలుగా విస్తరించాలని కోరారు. ఈ రహదారుల విస్తరణపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

నేషనల్ హైవే 65లో హైదరాబాద్ నుంచి మల్కాపూర్ వరకు 40 కి.మీ మేర ఆరు వరుసల రోడ్డు ఉంది. అయితే మల్కాపూర్ నుంచి విజయవాడ శివారులోని గొల్లపూడి వరకు 226 కి.మీ రోడ్డును నాలుగు వరుసల నుంచి ఆరు వరుసలకు విస్తరించాలని గతంలో ప్రతిపాదించారు. కానీ కొన్ని కారణాలతో కుదరలేదు.. గతంలో ఈ హైవే కాంట్రాక్ట్ సంస్థకు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మధ్య వివాదాల ఉన్నాయి. ఈ కారణంగా కోర్టు కేసులు కూడా నడిచాయి.. అందుకే రోడ్డు విస్తరణ పనులు జరగలేదు. ఈ క్రమంలో గతేడాది జీఎంఆర్ సంస్థ కాంట్రాక్ట్ గడువు ముగియడంతో.. NHAI అధికారులు విస్తరణకు సిద్ధమయ్యారు. ఈ 226 కి.మీ రోడ్డును ఆరు వరుసలుగా విస్తరించేందుకు రూ.8,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.. ఈమేరకు డీపీఆర్ కూడా సిద్ధం చేస్తున్నారు.
NHAI అధికారులు ఈ హైవేను గొల్లపూడి వరకు కాకుండా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు క్రాస్ అయ్యే కంచికచర్ల వరకే విస్తరించాలని చూస్తున్నారు. అప్పుడు ఈ హైవే 226 కి.మీ బదులు 198 కి.మీ మాత్రమే విస్తరిస్తారు. కంచికచర్ల నుంచి గొల్లపూడి వరకు 28 కి.మీ రోడ్డు నాలుగు వరుసలుగానే ఉంటుంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ జిల్లా ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి రావడంతో వెంటనే స్పందించి కేంద్ర మంత్రి గడ్కరీకి లేఖ రాశారు.. గొల్లపూడి వరకు ఆరు వరుసలు చేయాలని కోరారు.
విజయవాడ-మచిలీపట్నం హైవే విషయానికి వస్తే.. నగరంలోని బెంజ్ సర్కిల్ నుంచి మచిలీపట్నం వరకు 65 కి.మీ ఉంటుంది. ముందు కానూరు నుంచి మచిలీపట్నం వరకు 61 కి.మీ రోడ్డును విస్తరించాలని ప్రతిపాదించారు. అయితే బెంజ్ సర్కిల్ నుండి కానూరు వరకు చాలా భవనాలు ఉండటంతో అక్కడ సేకరించిన భూమి వెడల్పు 30 మీటర్లు మాత్రమే ఉండటంతో ఆరు వరుసలు చేయడం సాధ్యం కాదన్నారు. కానూరు నుంచి ROW 60 మీటర్ల మేర ఉంది.. కానూరు నుంచి మచిలీపట్నం వరకు 61 కి.మీ ఆరు వరుసలుగా విస్తరిస్తారని భావించారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు మాత్రం ఈ హైవేను కంకిపాడు దాటిన తర్వాత నెప్పల్లి దగ్గర అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర క్రాస్ అవుతుందని.. అక్కడి నుంచి మచిలీపట్నం వరకు 46 కిలోమీటర్లు ఆరు లైన్లుగా విస్తరించేందుకు డీపీఆర్ తయారు చేయాలని ఆదేశించారు. అప్పుడు కానూరు నుంచి నెప్పల్లి వరకు నాలుగు వరుసలు ఉంటుంది. అయితే ఈ అంశంపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. విజయవాడ-మచిలీపట్నం హైవే విషయంలో కూడా చంద్రబాబు కేంద్ర మంత్రి గడ్కరీకి మరో లేఖ రాశారు. నెప్పల్లి దగ్గర ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కాకుండా విజయవాడ నగర పరిధిలో కానూరు నుంచే ఆరు వరుసలుగా విస్తరించాలని కోరారు. విజయవాడలో ట్రాఫిక్, నగరం విస్తరిస్తోందని.. అందుకే కానూరు నుంచి హైవే చేపట్టాలని కోరారు. మరి దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.