అమరావతి, జూన్ 24: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ ఆన్లైన్ రాత పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు జులై 2వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో విద్యాశాఖ తొలుత పూర్తైన పరీక్షల ఆన్సర్ కీలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తుంది. ఇప్పటికే డీఎస్సీ గణితం సబ్జెక్టుకు సంబంధించిన ఆన్లైన్ రాత పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల చేయగా.. తాజాగా జూన్ 14న జరిగిన పీజీటీ వృక్షశాస్త్రం (ఇంగ్లీష్ మీడియం), జూన్ 17న జరిగిన జంతుశాస్త్రం (ఇంగ్లీష్ మీడియం) పరీక్షల ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ని విద్యాశాఖ విడుదల చేసింది.
ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్సైట్ నుంచి apdsc.apcfss.in ఆన్సర్ కీతోపాటు రెస్పాన్స్ షీట్లు, క్వశ్చన్ పేపర్లను డౌన్లోడ్ చేసుకోవచ్చుని మెగా డీఎస్సీ-2025 కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు. అభ్యర్థుల లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని ఓ ప్రకటనలో వివరించారు. ప్రాథమిక కీ పై అభ్యంతరాలను తగిన ఆధారాలతో జూన్ 29వ తేదీలోపు డీఎస్సీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానంలో తెలియజేయాలని ఆయన పేర్కొన్నారు.
కాగా ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షలు ఏపీతో సహా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. మెగా డీఎస్సీలో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,36,305 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కొక్కరు మూడు, నాలుగు పోస్టులకు దరఖాస్తు చేయడంతో దరఖాస్తులు దాదాపు 5,77,675 వరకు వచ్చాయి. వీరందరికీ దాదాపు 154 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.