ఎన్ని చట్టాలు వచ్చినా.. పకడ్బందీగా అమలు అవుతున్నా.. భ్రూణ హత్యలు జరుగుతున్నాయి. ఆడపిల్ల అని తెలిస్తే చాలు కడుపులోనే చంపుతున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు నేరం అయినప్పటికీ.. కొందరు కాసులు కోసం అడ్డదారులు తొక్కుతూ ఉన్నారు. పైకి చూస్తే ఎలక్ట్రీషియన్.. ఇంట్లో డోర్ తీసి చూస్తే సెటప్ చూసి పోలీసులు, అధికారులు దెబ్బకు షాక్ అయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం నగరంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసే యంత్రాన్ని స్వాధీనం చేసుకుని నిందితుణ్ని పోలీసులకు అప్పగించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఖమ్మం నగరంలో పంపింగ్ వెల్ రోడ్డులోని పరీక్షలు చేసే యంత్రంతో నిందితుడు ఎలక్ట్రిషియన్ అన్నవరపు అంజిరెడ్డి పట్టుబడ్డాడు. ఆయన ఇంటిపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. డీఎంహెచ్ఓ కళావతిబాయి, డిప్యూటీ డీఎంహెచ్ సైదులు, టాస్క్ఫోర్స్ బృందంతో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిందితుడి ఇంట్లో పోర్టబుల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రం లభించింది. దీంతోపాటు ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుణ్ని త్రీ టౌన్ పోలీసులకు అప్పగించారు. పీసీపీఎన్డీటీ చట్టాన్ని అతిక్రమించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ హెచ్చరించారు. నేరస్థులకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష ఉంటుందని చెప్పారు. గతంలోనూ ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిని నిఘా పెట్టి పట్టుకున్నారు. అయినా ఈ దారుణాలు ఆగడం లేదు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి