హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారింది. ఆ పద్మవ్యూహం నుంచి బయటపడటానికి వాహనదారులు ఓఆర్ఆర్పై ప్రయాణం చేస్తుంటారు. ఓఆర్ఆర్పై ప్రయాణం కొంతదూరం ఎక్కువగా ఉన్నప్పటికీ.. దానిపైనే ప్రయాణానికి మొగ్గు చూపిస్తుంటారు. ఓఆర్ఆర్పై ప్రయాణం చేస్తున్న వాహనారులకు కూడా ఆలస్యం కాకుండా ఉండేందుకు.. ఇప్పుడు టోల్ ప్లాజాల వద్ద బూస్టర్ లేన్లు అందుబాటులోకి వచ్చాయి. ఫాస్ట్ స్టాగ్ను సెకన్లలో రీడింగ్ చేసే సరికొత్త సాంకేతిక వ్యవస్థను ఈ లేన్లలో ఏర్పాటు చేశారు. దాంతో ఈ లేన్లో వాహనాలు ఆగే పరిస్థితి ఉండదు. బారికేడ్లు తెరిచి ఉండగానే.. ఫాస్టాగ్ రీడ్ అవుతుంది. దీంతో ఎలాంటి అడ్డంకుల్లేకుండా వాహనాలు సాఫీగా ముందుకు వెళతాయి.
నానక్ రాంగూడ టోల్ ప్లాజా దగ్గర ప్రయోగాత్మకంగా బూస్టర్ లైన్ ఫాస్ట్ స్టాగ్ను ఏర్పాటు చేశారు. నానక్ రాంగూడ – శంషాబాద్ మార్గంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ బూస్టర్ లైన్ సక్సెస్ అయిందని అధికారులు అంటున్నారు. నిమిషానికి సుమారు 15 వాహనాలు బూస్టర్ లేన్ల ద్వారా ముందుకు సాగుతున్నట్లు సిబ్బంది అంటున్నారు. ఇక్కడ పైలట్ ప్రాజెక్టు సక్సెస్ కావడంతో రద్దీ ఎక్కువగా ఉండే టోల్ ప్లాజాల వద్ద ఇదే విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
నగరంలో ట్రాఫిక్ ను తప్పించుకుని వేగంగా వెళ్లేందుకు వాహన దారులు ఎక్కువగా ఔటర్ పై వెళుతుంటారు. కొంతదూరం ఎక్కువగా ఉన్నప్పటికీ.. ట్రాఫిక్ ఏం ఉండదు. జర్నీ కూడా ప్రశాంతంగా సాగిపోతుందనే ఉద్దేశంతో ఔటర్పై ప్రయాణానికి ఇష్టపడుతుంటారు. అయితే ఔటర్పైకి వెళ్లే ముందు.. దిగే ముందు టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్లు ఎక్కువగా అవుతుంటాయి. టోల్ దాటేందుకు నాలుగైదు నిమిషాల సమయం పడుతోంది. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో పరిస్థితి మరీ దారుణంగా మారుతోంది. టోల్ గేట్ వద్ద ఫాస్టాగ్ రీడ్ అయ్యి, గేటు ఓపెన్ కావడానికి.. వాహనం గేటును దాటడానికి సగటున 20 సెకన్ల సమయం పడుతోంది. ఈ లెక్కన నిమిషానికి మూడు వాహనాలు మాత్రమే టోల్ గేట్ దాటుతాయి. ప్రధానంగా నానక్ రాంగూడ, శంషాబాద్ మార్గంలో టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ తీవ్రంగా ఉంటోంది. దీంతో అధికారులు ఈ మార్గంలో పైలట్ ప్రాజెక్టుగా బూస్టర్ లేన్ విధానాన్ని తీసుకువచ్చారు. మూడు గేట్లను బూస్టర్ లైన్లుగా కేటాయించారు. భారీ వాహనాలు, ఫాస్టాగ్ లేని కార్లకు ఈ లేన్లో అనుమతి ఉండదు.
టోల్ గేట్ ఉండే ఫాస్టాగ్ రీడరు అధునాతన సాంకేతికతతో అభివృద్ధి చేశారు. ఏడేళ్ల క్రితం ప్రవేశపెట్టిన(పాత) ఆర్ఎస్ఐడీ రీడర్లను అప్గ్రేడ్ చేశారు. దీంతో గేట్ పడి ఫాస్ట్స్టాగ్ రీడ్ అయ్యేదాకా ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. గేటు తెరిచే ఉంటుంది. వాహనం కదులుతుండగానే మూడు/ నాలుగు సెకన్లలోనే ఫాస్టాగ్ రీడ్ అవుతుంది. దీంతో వాహనం ఆగకుండా ముందుకు కదులుతుంది. ఇలా నిమిషానికి 15 వాహనాలు నిర్విరామంగా ముందుకు సాగుతున్నాయని అధికారులు తెలిపారు. నానక్ రాంగూడ, శంషాబాద్ మార్గంలో బూస్టర్ లేన్ విధానం విజయవంతమవ్వడంతో.. రద్దీ ఎక్కువగా ఉండే ఇతర ప్రాంతాల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. నానక్రాంగూడలో మూడు ఎంట్రీ, మూడు ఎగ్జిట్లలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. శంషాబాద్లోనూ ఎంట్రీ, ఎగ్జిట్లలో రెండేసి.. పోలీసు అకాడమీ జంక్షన్ వద్ద ఒకటి చొప్పున బూస్టర్ లేన్లు ఉన్నాయి. రద్దీ ఆధికంగా ఉండే పెద్దఅంబర్పేట్, శామీర్పేట్, పటాన్ చెరువు, మేడ్చల్ ఇంటర్చేంజ్ వద్ద కూడా బూస్టర్ లేన్లను ఏర్పాటు చేయడానికి అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి