లంకెలపాలెం జంక్షన్ లో లారీ బీభత్సం ఉమ్మడి విశాఖ జిల్లాను ఉలిక్కిపడేలా చేసింది. వేగంగా వచ్చిన ఓ లారీ సిగ్నల్ పాయింట్ వద్ద ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకొచ్చింది. మొదటగా ఓ కారును ఢీ కొట్టి, బొలెరోను ఢీకొట్టింది దాన్ని ఆలానే ఈడ్చికెళ్ళి.. బైకులపై నుంచి దూసుకెళ్లింది.. అంతటితో ఆగకుండా రోడ్డు దాటుతున్న కంటైనర్ను ఢీ కొట్టింది. రెప్ప పాటులో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు వాహనదారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది గాయాల పాలయ్యారు. మూడు కార్లు, ఓ ఆటో, ఐదు టూ వీలర్లు కూడా ఈ ప్రమాదంలో ధ్వంసమయ్యాయి. ఓ కారు అయితే నామరూపాలు లేకుండా పోయింది. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. తాజాగా బయటకొచ్చిన సీసీ ఫుటేజ్ దృశ్యాలు ఒళ్ళు గగుర్పాటుకు గురిచేస్తున్నాయి.
అనకాపల్లి నగర పరిధిలోని లంకెలపాలెం జంక్షన్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. అనకాపల్లి జిల్లా రేబాకకు చెందిన పచ్చికోరు గాంధీతో పాటు మరో ఇద్దరు కారులో కేజీహెచ్కు వెళ్లి చికిత్స పొందుతున్న తమ మిత్రుడిని పరామర్శించి వెనుదిరిగారు. తిరిగి వెళుతూ శ్రీనగర్లో మరో స్నేహితుడిని కారు ఎక్కించుకున్నారు. రాత్రి 10.15 గంటలకు లంకెలపాలెం కూడలికి కారు వచ్చేసరికి సిగ్నల్ పడడంతో వాహనాన్ని ఆపారు. అదే మార్గంలో వెనుక నుంచి వచ్చిన లారీ.. గాంధీ కారుతో పాటు మరో రెండు కార్లను బలంగా ఢీకొంది. ఆపై కార్లను ఈడ్చుకుంటూ పరవాడ నుంచి లంకెలపాలెం వైపు వస్తున్న కంటైనర్ లారీని ఢీకొంది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న గాంధీతో పాటు మరొకరు చనిపోయారు. అలాగే బైక్పై వేచి ఉన్న ఫార్మా ఉద్యోగి వై.ఎర్రప్పడు మృతిచెందారు. మరో రెండు కార్లు బైకులపై ఉన్న 17 మంది గాయపడ్డారు.
వీడియో చూడండి..
విశాఖ పోర్టు నుంచి తెలంగాణలోని సిద్దిపేటకు పప్పుల లోడుతో వెళ్తున్న లారీ సోమవారం రాత్రి 10:30 గంటలకు సమయంలో లంకెలపాలెం జంక్షన్ వద్ద ఆగి ఉన్న వాహనాలను ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదం జరిగిన తర్వాత పరారైన లారీ డ్రైవర్ కోటిరెడ్డిని తాజాగా అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. బ్రేకులు సకాలంలో పట్టకపోవడం కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..