ఇరాన్పై అమెరికా జరిపిన దాడులకు సంబంధించి పెంటగాన్కు చెందిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ విడుదల చేసిన నివేదిక తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమెరికా దాడుల్లో అణు కేంద్రాలు పూర్తిగా నాశనమయ్యాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలపగా, డిఫెన్స్ ఎజెన్సీలు మాత్రం ఇరాన్కు పరిమితంగా నష్టం వాటిల్లిందని పేర్కొన్నట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. దీంతో ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ నివేదికలను వైట్హౌస్ తోసిపుచ్చింది.
ఇరాన్లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణుకేంద్రాలపై బీ-2 స్పిరిట్ బాంబర్లతో అమెరికా భారీ దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఆయా అణుకేంద్రాలు నాశనం అయ్యాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రకటించారు. అయితే, ఇంటెలిజెన్స్ నివేదికలు అందుకు వ్యతిరేకంగా ఉన్నాయి. మూడు అణుకేంద్రాలు లక్ష్యంగా దాడులు చేయగా అందులో ఫోర్డో, నతాంజ్లు పూర్తిగా నాశనం కాలేదని నివేదికలో పేర్కొంది. యురేనియం శుద్ధి చేసేందుకు ఉపయోగించే సెంట్రిఫ్యూజ్లు వంటి కీలక పరికరాలను ఇరాన్ కొన్ని నెలల్లోనే తిరిగి పునఃప్రారంభించుకోవచ్చని తెలిపింది.
ఈ నివేదికలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. అవి నకిలీ వార్తలని పేర్కొన్న ఆయన చరిత్రలో అత్యంత విజయవంతమైన సైనిక దాడుల తీవ్రతను తగ్గించే ప్రయత్నం అన్నారు. కొన్ని వార్తా సంస్థలు చేస్తున్న ప్రయత్నమని మండిపడ్డారు. ఆయా వార్తా సంస్థలను ప్రజలు నమ్మడం లేదని ఇరాన్లోని అణుకేంద్రాలు పూర్తిగా నాశనమయ్యాయని సామాజిక మాధ్యమం ట్రూత్లో ట్రంప్ ఈ మేరకు పోస్టు పెట్టారు.
ఇదిలావుంటే అమెరికా వైమానిక దాడుల్లో తమ అణు కేంద్రాలు తీవ్రమైన నష్టాన్ని చవిచూశాయని ఇరాన్ తొలిసారిగా అధికారికంగా అంగీకరించింది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘై అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిని ధృవీకరించారు. దాడుల వివరాలను ఇవ్వడానికి బాఘై నిరాకరించినప్పటికీ, ఆదివారం(జూన్ 22) అమెరికన్ B-2 స్టెల్త్ బాంబర్లు నిర్వహించిన దాడులు చాలా తీవ్రమైనవని ఆయన అంగీకరించారు. “అణు కేంద్రాలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయనడంలో సందేహం లేదు” అని ఆయన అన్నారు.
ఈ దాడులలో అమెరికా ఒక ప్రత్యేక రకమైన బంకర్ బస్టర్ బాంబు’ను ఉపయోగించిందని చెబుతున్నారు. వీటిని భూగర్భంలో నిర్మించిన బలమైన, సురక్షితమైన ప్రదేశాలను నాశనం చేయడానికి తయారు చేశారు. ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఇప్పటికే తారాస్థాయికి చేరుకున్న సమయంలో ఈ దాడులు జరిగాయి. ఇరాన్ అణు కార్యక్రమం గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు ఇప్పటికే పెరుగుతున్నాయి. టెహ్రాన్ రహస్యంగా అణ్వాయుధాల వైపు కదులుతోందని పాశ్చాత్య దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో ఈ దాడులు జరిగాయి.
దేశంలో ఇంటర్నెట్ సేవ ఇప్పుడు మునుపటి స్థితికి తిరిగి వచ్చిందని ఇరాన్ కమ్యూనికేషన్ మంత్రి సత్తార్ హషేమి అన్నారు. ఇటీవలి ప్రభుత్వ ఆంక్షలకు ముందు మాదిరిగానే కొనసాగుతాయన్నారు. అతను సోషల్ మీడియా Xలో పోస్ట్ చేసి, “ఇలాంటి పరిస్థితి మళ్ళీ జరగదని” హామీ ఇచ్చారు. జూన్ 17న ప్రభుత్వం ఇంటర్నెట్ను నిలిపివేసింది. ఇది సైబర్ దాడులను ఎదుర్కోవడానికి ఒక వ్యూహం అని చెబుతూ, కానీ చాలా ప్రాంతాల్లో దాదాపు పూర్తిగా ఇంటర్నెట్ బ్లాక్అవుట్ పరిస్థితి ఉంది.
మరోవైపు, IAEA పరిశోధకులు మరోసారి ఇరాన్ అణు కేంద్రాలను సందర్శించి దర్యాప్తు చేయడమే తన అతిపెద్ద ప్రాధాన్యత అని అంతర్జాతీయ అణు సంస్థ (IAEA) చీఫ్ రాఫెల్ గ్రాస్సీ అన్నారు. ముఖ్యంగా ఇటీవలి అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత అక్కడ ఎలాంటి నష్టం జరిగిందో, ఇరాన్ వద్ద ఎంత సంపన్నమైన యురేనియం మిగిలి ఉందో చూడటానికి వెళ్తామన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..