ఏపీని లాజిస్టిక్ హబ్గా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే కొత్త ఎయిర్ పోర్టులు నిర్మించాలని సంకల్పించింది. ప్రస్తుతం ఉన్న ఏడు విమానాశ్రయాలకు అదనంగా మరో ఏడు విమానాశ్రయాలు నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని అమరావతితోనూ అనుసంధానం పెంచేలా.. అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మించాలని ప్రతిపాదించారు. 5000 ఎకరాల్లో అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.

ఈ నేపథ్యంలో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక విషయాలు వెల్లడించారు. అమరావతిలో అదనపు భూ సమీకరణకు జులై నెలాఖరులో సీఆర్డీఏ నోటిఫికేషన్ ఇస్తుందని మంత్రి నారాయణ వెల్లడించారు. అలాగే అదనపు భూ సమీకరణకు 2015 నాటి నిబంధనలే అమలు చేయనున్నట్లు తెలిపారు. దీనికి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. అమరావతిలో 5000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించనున్నారు. అలాగే 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ, మరో 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం 10 వేల ఎకరాలు అవసరమవుతుందని మంత్రి నారాయణ వెల్లడించారు.
మరోవైపు అమరావతి భవిష్యత్తు అవసరాల కోసం అదనంగా 45 వేల ఎకరాలు సమీకరించనున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటుందన్న ఆయన.. ఈ నేపథ్యంలో ఎక్కువ భూమి అవసరమవుతోందన్నారు. మరోవైపు అమరావతిలో అనేక సంస్థలకు ప్రభుత్వం భూములు కేటాయిస్తోంది.
రాజధాని అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే క్రమంలో పలు కంపెనీలకు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అమరావతిలో భూములు కేటాయిస్తోంది. ఇప్పటి వరకూ సుమారుగా 74 సంస్థలకు అమరావతిలో భూములు కేటాయించారు. మూడేళ్లలోగా అమరావతి నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది.