తెలుగు రాష్ట్రాల్లో వరుస కిడ్నీ రాకెట్ దందాలు వెలుగులోకి వస్తున్నాయి. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలే టార్గెట్గా కిడ్నీ రాకెట్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లాలో కిడ్నీ రాకెట్ కలకలం రేపింది. విజయవాడ కేంద్రంగా సాగుతున్న కిడ్నీ రాకెట్ గుట్టును కోదాడ పోలీసులు ఛేదించారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన తాతారావు, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా గొల్లపూడి గ్రామానికి చెందిన ఫార్మాసిస్ట్ కొండం రమాదేవి, విజయవాడకు చెందిన బొందిలి పృద్వీరాజు, మహమ్మద్ సర్దార్, గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన కొడాలి బాబూరావు, కందుకూరి విష్ణు వర్ధన్ బాబులతో మరో నలుగురు కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఈజీ మనీ కోసం ఈ ముఠా విజయవాడలోనీ కిడ్నీ డయాలసీస్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ, కిడ్నీ బాధితులతో పరిచయం పెంచుకుంటారు. చట్టబద్ధత కలిగిన ఆసుపత్రుల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కు అవసరమైన క్లియరెన్స్ సర్టిఫికెట్లను ఇస్తామని అమాయక కిడ్నీ బాధితులను నమ్మించి పెద్ద మొత్తంలో డబ్బులతో ఊడాయిస్తుంటారు.
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన నరేష్ అనే యువకుడు కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. హైదరాబాద్, విజయవాడ పట్టణాల్లోని పలు డయాలసిస్ సెంటర్లకు వెళ్లిన నరేష్ కు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలని వైద్యులు సూచించారు. కిడ్నీలు ఇచ్చేందుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చినప్పటికీ.. వారి వయసు రీత్యా పనికిరావని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో కిడ్నీ దాత కోసం నరేష్ ఎదురు చూస్తున్నాడు. గత ఏడాది డిసెంబర్ నెలలో విజయవాడకు చెందిన అమెరికన్ కిడ్నీ సెంటర్ వద్ద నరేష్ కు ఈ ముఠా పరిచయమైంది. ఇదే సమయంలో నరేష్ కు కిడ్నీ డోనర్ కూడా దొరికాడు.
కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కు అవసరమైన డోనార్ క్లియరెన్స్ సర్టిఫికెట్లను ఇస్తామని ముఠా నమ్మించింది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే హాస్పిటల్ కు 12 లక్షల రూపాయలు, క్లియరెన్స్ సర్టిఫికెట్స్ ఇచ్చినందుకు పది లక్షల రూపాయలు అంటూ ఈ ముఠా వసూలు చేసింది. తీరా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే సమయానికి ముఠా డబ్బులతో పరార్ అయింది. ఈ ముఠా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే డాక్టర్కు డబ్బులు చెల్లించకపోవడంతో ముఠా గుట్టు రట్టు అయింది. డాక్టర్ను బతిమిలాడుకుని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నానని బాధితుడు నరేష్ వాపోయాడు.
కిడ్నీ మార్పిడి చికిత్సకు అవసరమైన కిడ్నీ డోనర్.. కిడ్నీ పేషంట్ డిఎన్ఏ కలిసేలా రిపోర్టు, బ్లడ్ శాంపిల్స్ రిపోర్టు, ఆధార్ కార్డులు ఈ ముఠా తయారు చేసింది. ఇందుకోసం గుంటూరులో అధికారుల స్టాంపులు తయారు చేయించి వైద్యాధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి క్లియరెన్స్ సర్టిఫికెట్లను ఈ ముఠా తయారు చేసింది. కోదాడ ఇంచార్జ్ డిఎంహెచ్వో ఇచ్చిన ఫిర్యాదుతో కోదాడ పోలీసులు రంగంలోకి దిగి ఈ ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ ముఠా ఇప్పటివరకు ఫోర్జరీ పత్రాలతో 10 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠాలోని ఆరుగురిని అరెస్ట్ చేశామని, నలుగురు పరారీలో ఉన్నారని కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి చెబుతున్నారు. ఈ ముఠా నుంచి ఏడు ఫోన్లు, అధికారుల రబ్బర్ స్టాంపులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. కిడ్నీ రాకెట్పై లోతైన దర్యాప్తు కొనసాగుతుందని ఆయన అన్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..