Kuppam New Airport Land Acquisition: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కుప్పంలో విమానాశ్రయం కోసం భూసేకరణ చేస్తున్నారని.. ఈ క్రమంలో రైతు మరణించాడని వస్తున్న వార్తలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. కుప్పంలో బలవంతంగా భూసేకరణ చేయడం లేదని, శ్రీనివాసులు అనే రైతు గుండెపోటుతో మరణించారని, ఆయన భూమిని స్వచ్ఛందంగానే ఇచ్చారని ప్రభుత్వం స్పష్టం చేసింది. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.
హైలైట్:
- కుప్పంలో కొత్తగా ఎయిర్పోర్ట్
- భూసేకరణ కూడా ప్రారంభం
- రైతు మరణంపై వివాదం
- స్పందించిన ఏపీ ప్రభుత్వం

ఏపీలో కొత్త ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ.. ఆ జిల్లా దశ తిరిగినట్లే, రైతు మరణంపై వివాదం.. క్లారిటీ ఇదే
కుప్పంలో కొత్త ఎయిర్పోర్టు బలవంతపుర భూసేకరణ పేరుతో తప్పుడు ప్రచారం జరుగుతోందని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. ‘కుప్పం విమానాశ్రయానికి బలవంతంగా భూసేకరణ చేస్తున్నారు అనేది పూర్తిగా అవాస్తవం. కొంత మంది శ్రీనివాసులుకు ఉన్న 3 ఎకరాలు ప్రభుత్వం బలవంతంగా లాక్కుందని సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారు. కుప్పంకు చెందిన శ్రీనివాసులుకు 3 ఎకరాలు ఉంది అనేది అవాస్తవం. ఆయనకు 1.71 ఎకరాలు ఉంటే దానిని ఇష్టపూర్వకంగానే భూసేకరణకు ఇస్తున్నానని తన స్వహస్తాలతో సంతకం చేశారు. శ్రీనివాసులు భూమిని ప్రభుత్వం లాక్కుందని గుండెపోటుతో చనిపోయాడనేది పూర్తిగా దుష్ప్రచారం. గత రెండేళ్లుగా ఆస్తమా, గుండెజబ్బు సమస్యలతో బాధపడుతున్న శ్రీనివాసులు ఈరోజు ఉదయం నిద్రలోనే గుండెపోటుతో మృతిచెందారు. కుప్పం విమానాశ్రయాన్ని అడ్డుకోవాలని చూస్తున్న వారి అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దు’ అని క్లారిటీ ఇచ్చారు. కుప్పం ఎయిర్పోర్ట్ ఏర్పాటుతో ఆ ప్రాంతం దశ తిరిగినట్లే అంటున్నారు.. భూముల ధరలు పెరుగుతాయంటున్నారు.