నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో సామాన్య భక్తుల సౌకర్యార్థం జులై 1 నుంచి శ్రీశైల మల్లికార్జున స్వామి వారి ఉచిత స్పర్శ దర్శనం పునః ప్రారంభిస్తున్నట్లు శ్రీశైల దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. గతంలో లాగానే వారంలో 4 రోజుల పాటు అనగా మంగళ, బుధ, గురు, శుక్ర వారాలలో మధ్యాహ్నం గం.1.45 నుంచి 3.45 వరకు రెండు గంటల పాటు స్వామివారి ఉచిత స్పర్శ దర్శనం కొనసాగుతుందని ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత నిస్తూ శ్రీ మల్లికార్జున స్వామిని స్వయంగా స్పర్శించడం ద్వారా ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలనే ప్రతీ భక్తుడి కోరికకు అనుగుణంగా ఈ ఉచిత స్పర్శ దర్శనం సౌకర్యం పునః ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
ఉచిత స్పర్శ దర్శనంలో కూడా కొత్తగా టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. ఉచిత దర్శనం కోసం ఏరోజుకారోజు కౌంటర్ల ద్వారా టోకన్లను జారీ చేయబడుతాయన్నారు. ఈ కంప్యూటరైజ్డ్ టోకెన్లలో భక్తుని పేరు, ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరును నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ టోకెన్లను ఉచిత దర్శనం ప్రవేశద్వారం వద్ద గల స్కానింగ్ ద్వారా తనిఖీ చేసి భక్తులను ఉచిత స్పర్శ దర్శనానికి అనుమతించడం జరుగుతుందన్నారు. టోకెన్లు పొందిన భక్తులు మాత్రమే ఉచిత స్పర్శ దర్శనానికి అనుమతించడం జరుగుతుందని.. వీరిని ఉచిత దర్శన క్యూలైన్ ద్వారా మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపారు.
ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి ఉచిత స్పర్శ దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులతో ధరించవలసి ఉంటుంది. భక్తుల రద్దీ కారణంగా మహాశివరాత్రి, ఉగాది, దసరా మహోత్సవాలు, శ్రావణ మాసం, కార్తిక మాసం, ప్రభుత్వ సెలవు రోజులలో ఈ ఉచిత స్పర్శ దర్శనానికి అవకాశం ఉండదని తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి