టెస్ట్ కొత్త ర్యాంకింగ్స్ను ఐసీసీ ప్రకటించింది. ఈ సారి టీమిండియా నుంచి నలుగురు ఆటగాళ్లు టాప్-10లో చోటు దక్కించుకున్నారు. బ్యాట్స్మెన్ జాబితాలో ఇద్దరు కనిపిస్తే, బౌలర్ల జాబితాలో ఒకరు చోటు దక్కించుకున్నారు. ఆల్ రౌండర్ల జాబితాలో టీమిండియా ప్లేయర్ నంబర్ వన్ ప్లేస్లో ఉండటం విశేషం. మరి ఆ ప్లేయర్లు ఎవరో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న బౌలర్ టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా. హెడింగ్లీలో ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో 5 వికెట్లు తీసిన బుమ్రా 907 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలుపుకున్నాడు. బుమ్రా తప్ప, టీం ఇండియా నుంచి మరే ఇతర బౌలర్ కూడా బౌలర్ల జాబితాలో టాప్ టెన్లో చోటు దక్కించుకోలేదు.
ఐసీసీ టెస్ట్ బ్యాట్స్మెన్ జాబితాలో టీమిండియా యువ బ్యాట్స్మన్ యశస్వి జైస్వాల్ 4వ స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో 101 పరుగులతో అద్భుతమైన సెంచరీ చేసిన జైస్వాల్ ఇప్పుడు 851 పాయింట్లతో 4వ స్థానంలో ఉన్నాడు.
ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీలు చేసిన రిషబ్ పంత్ 801 పాయింట్లతో టెస్ట్ బ్యాట్స్మెన్ జాబితాలో 7వ స్థానానికి ఎగబాకాడు. ఇది భారత వికెట్ కీపర్ సాధించిన అత్యుత్తమ స్థానం. అంటే.. టీమిండియా నుండి ఏ వికెట్ కీపర్ కూడా టెస్ట్ ర్యాంకింగ్స్లో 800 పాయింట్లకు పైగా సాధించలేదు. ఇప్పుడు పంత్ 801 రేటింగ్తో ఏడో స్థానంలో నిలిచాడు.
ఐసీసీ టెస్ట్ ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్లో రవీంద్ర జడేజా కూడా అగ్రస్థానంలో ఉన్నాడు. 376 పాయింట్లతో జడేజా గత కొన్ని నెలలుగా అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇంగ్లాండ్తో జరిగే మిగిలిన మ్యాచ్లలో అతను బాగా రాణిస్తే, అతని రేటింగ్ 400 దాటే అవకాశం ఉంది.