జులై 15 నుంచి జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు కూడా టోల్ ట్యాక్స్ అంటూ జరిగిన ప్రచారాన్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండించింది. టూ వీలర్స్కు ఎలాంటి టోల్ ట్యాక్స్ విధించడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. టూ వీలర్స్పై టోల్ ప్లాజాల దగ్గర ఎలాంటి ట్యాక్స్ విధించబోమని తెలిపింది.. అంతకుముందు టూవీలర్స్కు కూడా ఫాస్టాగ్ తప్పనసరి అంటూ జోరుగా ప్రచారం జరిగింది. జాతీయ రహదారులపై ఫోర్ వీలర్స్, ఇతర పెద్ద వాహనాలకు మాత్రమే టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఇదే విధానం కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
జూలై 15 నుండి ద్విచక్ర వాహనాలను టోలింగ్ ఫ్రేమ్వర్క్ కిందకు తీసుకురావచ్చని కొన్ని మీడియాలలో ప్రసారం అవుతున్న వార్తలను కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్రంగా ఖండిచారు. ప్రజలను అయోమయానికి గురి చేసేందుకు ప్రయత్నించవద్దని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్లో కూడా టూవీలర్స్కు టోల్ ట్యాక్స్ విధించే అవకాశం లేదని ట్వీట్ చేశారు. ద్విచక్ర వాహనాలపై టోల్ పన్ను విధించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదని.. అనవసరమైన వార్తలను ప్రచారం చేయొద్దని.. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం స్పష్టం చేశారు.
“ద్విచక్ర వాహనాల నుండి టోల్ వసూలు గురించి కొన్ని మీడియా సంస్థలు తప్పుదారి పట్టించే వార్తలను వ్యాప్తి చేస్తున్నాయి. అలాంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదు. టోల్ పన్ను నుంచి ద్విచక్ర వాహనాలకు మినహాయింపు కొనసాగుతుంది” అని గడ్కరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా మీడియా వేదికలను ఆయన కోరారు..
ప్రస్తుతం, జాతీయ రహదారులపై టోల్ ఛార్జీల నుండి ద్విచక్ర వాహనాలకు మినహాయింపు ఉంది.. ఈ విధానం ఏం మారలేదు. అయితే, యాక్సెస్ కంట్రోల్డ్ హైవేలు – ఎక్స్ప్రెస్వేలలో ద్విచక్ర వాహనాల ప్రవేశం మాత్రం చట్టవిరుద్ధం..