ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటో చూపిస్తున్నామని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేవలం ఒకపదం కాదనీ.. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే డబుల్ పవర్ అని చెప్పుకొచ్చారు. శక్తిమంతమైన నాయకులు, ప్రభుత్వంతోనే అభివృద్ధి.. అని.. డబుల్ పవర్ ఉంటేనే ప్రాజెక్టులు అవలీలగా పూర్తవుతాయన్నారు. ఇక్కడ శక్తివంతమైన సర్కార్ ఉన్నా, కేంద్రంలోనూ అలాగే ఉంటే.. మరింత బలంగా పనిచేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఏపీలో డబుల్ ఇంజిన్ పవర్ కనిపిస్తోందంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రాజమండ్రిలో కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ తో కలిసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ. రాష్ట్ర అభివృద్ధిలో పర్యాటక రంగం చాలా కీలకమని, ఈ రంగంలో యువతకు ఎక్కువ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చని పేర్కొన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టు పూర్తయితే దాదాపు 4 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని చెప్పారు. శక్తివంతమైన నాయకులు, ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి వేగవంతమవుతుందని, డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్ర ప్రగతి పరుగులు పెడుతుందన్నారు. రూ.430 కోట్లతో ఈ రోజు రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నామని, త్వరలోనే రాష్ట్రాన్ని టూరిజం హబ్ గా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. అలాగే గోదావరి, కృష్ణా, వంశధార వంటి నదీ తీరాలు ఉన్నాయి. మిగతా దేశాల్లో అయితే హోటళ్లు, రెస్టారెంట్లు వంటివి పెట్టి అభివృద్ధి చేస్తారు. మన దేశంలో మాత్రం నదులు మన జీవన విధానం, సంస్కృతిలో భాగం. అందుకే అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా పుష్కరాల రేవును ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధం చేశామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఘాట్ లో ఉన్న ఆలయాల విశిష్టత తెలియజేసేలా ఏర్పాట్లు చేయడంతో పాటు గోదావరి హారతి ఇచ్చేలా తీర్చిదిద్దుతామన్నారు.
డబుల్ ఇంజన్ సర్కార్ తోనే అభివృద్ధి : కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. మోదీ నాయకత్వంలో దేశంలో పర్యటక అభివృద్ధి ఎంతో వేగంగా జరుగుతోంది. డబుల్ ఇంజన్ సర్కార్ తో రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తోందన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా రూ.94.44 కోట్లతో రాజమహేంద్రవరం, కడియం, నిడదవోలు పరిసర ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగా 127 ఏళ్ల చారిత్రక నేపథ్యం కలిగిన హేవ్ లాక్ వంతెనను ఆదునీకరించడమే కాకుండా దానిని పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..