జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తూ కూలిపోయిన AI 171 విమాన ప్రమాద దర్యాప్తు గురించి కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక విషయాలను వెల్లడించింది. విమాన ప్రమాద దర్యాప్తు బ్లాక్ బాక్స్ డేటా రికవరీ పూర్తయింది. డేటా విశ్లేషణపై AAIB దర్యాప్తు బృందం పనిచేస్తుందని ప్రకటన విడుదల చేసింది. ICAO చికాగో కన్వెన్షన్ (1944) , విమాన ప్రమాద దర్యాప్తు నియమాల ప్రకారం AI 171 విమాన ప్రమాద దర్యాప్తు కొనసాగుతుందని తెలిపింది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అంతు చిక్కని ప్రశ్నలు. ఇప్పటివరకు బోయింగ్ ఎలా కూలిందో కారణాలు తెలియరాలేదు. కూలే ముందు పైలట్ మేడే కాల్ ఇచ్చిన వాయిస్ రికార్డ్ మాత్రమే ఉంది. 242 ప్రయాణికుల్లో బతికింది ఒక్కడే. అంత భారీ విస్పోటనం జరిగాక.. ఎవరూ బతికే చాన్స్ లేదని అందరూ భావించారు. కానీ 11ఏ సీటులో కూర్చున్న విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. ఇది ఆనందించాల్సిన విషయమే. కానీ అంత విస్ఫోటనంలో అతనొక్కడు ఎలా బయటపడ్డాడన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
విమాన ప్రమాదం జరిగిన తరువాత జూన్ 13 న AI 171 విమాన ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించింది. ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) అంతర్జాతీయ ప్రోటోకాల్ ప్రకారం DG AAIB నేతృత్వంలో దర్యాప్తు బృందం పనిచేస్తుంది. ఏవియేషన్ మెడిసిన్ స్పెషలిస్ట్, ATC అధికారి, బోయింగ్ విమాన తయారీ సంస్థ ప్రతినిధి, అమెరికా ప్రభుత్వ దర్యాప్తు సంస్థ అయిన నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) దర్యాప్తు బృందంలో సభ్యులుగా ఉన్నారు. జూన్ 13, 16 తేదీల్లో బ్లాక్ బాక్స్ రికవరీ జరిగింది.
జూన్ 24 న IAF విమానం ద్వారా అహ్మదాబాద్ నుండి ఢిల్లీకి బ్లాక్ బాక్స్ను ల్యాబ్కి చేర్చారు. జూన్ 24న AAIB , NTSB సాంకేతిక సభ్యులతో డేటా వెలికితీత ప్రక్రియను ప్రారంభించిన DG AAIB నేతృత్వంలోని బృందం..బ్లాక్ బాక్స్ నుండి సురక్షితంగా క్రాష్ ప్రొటెక్షన్ మాడ్యూల్ (CPM) వెలికి తీశారు. జూన్ 25న AAIB ల్యాబ్లో మెమరీ మాడ్యూల్ విజయవంతంగా యాక్సెస్ చేసి డేటాను డౌన్లోడ్ చేశారు. ప్రస్తుతం CVR (కాక్ పిట్ వాయిస్ రికార్డర్), FDR(ఫ్లైట్ డేటా డిజిటల్ రికార్డర్) డేటా విశ్లేషణ జరుగుతోంది.
విమాన ప్రమాదానికి దారితీసిన సంఘటనల క్రమాన్ని పునర్నిర్మించడం విమానయాన భద్రతను మెరుగుపరచడానికి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలను నివారించడానికి దోహదపడే అంశాలను గుర్తించడం కోసం బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషణ ఉపయోగపడనుంది. దేశీయ చట్టాలు, అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు విమానయాన శాఖ తెలిపింది. ప్రపంచంలోనే మొట్ట మొదటి బోయింగ్ విమానం కూలడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ విమాన ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు సహా 34 మంది బీజే మెడికల్ కళాశాల విద్యార్థులు చనిపోయారు.
అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి టెకాఫ్ అయిన 30 సెకన్లకే విమానం కూలిపోయి భారీ పేలుడు సంభవించింది. మృతదేహాల గుర్తింపు.. అప్పగింత కోసం 10 రోజుల సమయం పట్టింది. విమాన ప్రమాద దర్యాప్తును AAIB సహా కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటి దర్యాప్తు జరుపుతుంది. విమాన ప్రమాద దర్యాప్తు ప్రోటోకాల్ ప్రకారం ఏడాది వరకు విమాన ప్రమాద దర్యాప్తుకు గల కారణాలను వెల్లడించాల్సి ఉంటుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..