పురిట్లోనే అమ్మానాన్నల ఆలనాపాలనకు దూరమై.. ముళ్ల కంచెల్లోనో, తుమ్మ పొదల్లోనో, కాలువల్లోనో, ఏదైనా వీధుల్లోని చెత్త కుండీల్లోనో లభిస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరగడం విషాదకరం. అయితే, అలాంటి వారికోసం ఒక వినూత్న పథకాన్ని ప్రారంభించింది కరీంనగర్ జిల్లా యంత్రాంగం. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి బ్రెయిన్ చైల్డ్గా.. చిన్నారుల కోసం ప్రారంభమైన ఆ పథకమే ఊయల. కరీంనగర్ మాతా, శిశు సంరక్షణ ఆసుపత్రిలో ఈ ఊయల సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు అధికారులు. ఎవరైనా అనాథలుగా దొరికినా.. తమకు పిల్లలు వద్దనుకున్నా వారు పిల్లలను తీసుకొచ్చి ఈ ఊయలలో వేయోచ్చని తెలిపారు. అలా వదిలి వెళ్లిన చిన్నారుల బాగోగులు, కావాల్సిన వైద్య సదుపాయం అందించి, చైల్డ్ హోం ద్వారా చూసేలా ఊయల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం ఓ మూడేళ్ల వికలాంగురాలైన అమ్మాయిని మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఊయలలో వదిలివెళ్లారు. ఊయల కార్యక్రమం ప్రారంభం అయ్యాక ఇదే మొదటి కేసు. పురిటిలోని పిల్లలను మాత్రమే ఉద్దేశించిన ఊయలలో మూడేళ్ల అమ్మాయిని వదిలేసినా అధికారులు అదే ట్రీట్మెంట్ ఇచ్చి ఆమెకు చైల్డ్ హోంలో ఉంచేలా ప్రయత్నం చేస్తున్నారు. ఆలా వేసిన పిల్లల బాగోగులను అధికారులే చూసుకుంటున్నారు. పెరిగిన తరువాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం దత్తత ఇస్తున్నారు.
ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక అన్నట్టు.. ఏ తల్లిదండ్రులు కన్నారో తెలియకుండానే.. తల్లి పాలకు కూడా నోచుకోని పసిబిడ్డలకు జీవితాన్నిచ్చే ఈ ఊయల ఇప్పుడు అందరి మన్ననలందుకుంటోంది. అంతే కాకుండా ఎంతో మంది చిన్నారులను అనాదలు కాకుండా కాపాడుతూ.. పునర్జన్మనిస్తుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..