పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వకుండా, వృద్ధాప్యంలో వారికి కావాల్సిన కనీస అవసరాలు కూడా తీర్చకుండా, ఇంట్లో చోటు ఇవ్వకుండా బరితెగిస్తున్నారు కొందరు పుత్ర రత్నాలు. హైదరాబాద్ నగరంలో సరిగ్గా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. మలక్పేట్ పరిధిలోని సైదాబాద్ ప్రాంతంలో తన తల్లికి ఇంట్లో చోటు ఇవ్వకుండా చూస్తున్న ఇద్దరు కుమారులపై హైదరాబాద్ RDO ను ఆశ్రయించింది ఆ తల్లి.
గతకొన్ని సంవత్సరాల క్రితం భర్త చనిపోవడంతో తన కుమారుడు వద్దనే శకుంతలా భాయ్ నివసిస్తుంది. వృద్ధాప్యంలో తల్లికి కావాల్సిన సౌకర్యాలు తీసుకోవాల్సిన కొడుకులు ఆమెను గాలికి వదిలేయడంతో పాటు ఇంట్లో చోటు ఇవ్వకుండా బాధపడుతున్నారు. ఈ వ్యవహారంపై తల్లి ఇద్దరు కుమారులపై హైదరాబాద్ ఆర్డీవోకు ఫిర్యాదు చేసింది. ఆమెతోపాటు పలువురు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులను సైతం తనతో పాటు తీసుకెళ్లి ఫిర్యాదు చేసింది. తన కొడుకులను ఇంట్లో నుండి ఖాళీ చేయించి తనకు ఆ ఇంటిని అప్ప చెప్పాలని ఆమె ఆర్డీవోను వేడుకుంది.
శకుంతల ఫిర్యాదు రావడంతో ఆర్డీవో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టి ఆమె ఇద్దరు కుమారులకు నోటీసులు జారీ చేశారు. ఇద్దరిని విచారణకు పిలిచి కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు. తల్లిని చూసుకోవాల్సిన తీరు, వృద్ధాప్యంలో కనీస సౌకర్యాలు కల్పించే అంశంపై ఇద్దరు కొడుకులకు ఆర్డీవో కౌన్సిల్ చేశారు. అయితే తన తల్లి కోరిక మేరకు ఇద్దరు కొడుకులను ఇంటి నుండి పంపించేయాల్సిందిగా ఆమె కోరడంతో ఆర్డీవో సైతం ఇద్దరు కుమారులకు అదే రీతిలో ఆదేశాలు జారీ చేశారు.
ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోతారా లేదా ప్రభుత్వ చర్యలు తీసుకోమంటారా అంటూ ఇద్దరు కొడుకులకు ఆర్డీవో వార్నింగ్ ఇచ్చారు. ఇంటిని ఖాళీ చేసేందుకు మొదట ఇద్దరు కుమారులు మొరాయించినా, చివరికి అంగీకరించారు. అయినా సరే ఇంట్లో నుండి వెళ్ళిపోకుండా ఉండటంతో తల్లి మరోసారి ఆర్డీవోను ఆశ్రయించింది. దీంతో రెవెన్యూ అధికారులు నేరుగా ఇంటికి చేరుకునేసరికి ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించారు. దీంతో ఆ ఇంటిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..