సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎస్సై, కానిస్టేబుల్ మృతి చెందారు. కోదాడ వద్ద కారు లారీని ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత కూడా విచారం వ్యక్తం చేశారు.
హైలైట్:
- రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ, కానిస్టేబుల్ మృతి
- సీఎం చంద్రబాబు నాయుడు ఎమోషనల్ పోస్ట్
- బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ

ఇదీ జరిగింది
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఆలమూరు ఎస్సై.. ఎమ్ అశోక్ నలుగురు సిబ్బందితో కలిసి ఒక కేసు విచారణ నిమిత్తం బుధవారం (జూన్ 25, 2025) అర్ధరాత్రి హైదరాబాద్కు బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో సూర్యాపేట జిల్లాలోని కోదాడ పట్టణ బైపాస్లోని దుర్గాపురం స్టేజి వద్ద ఆగి ఉన్న ఒక లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కావడంతో అందులో ప్రయాణిస్తున్న ఎస్సై అశోక్, కానిస్టేబుల్ బ్లెస్సన్ జీవన్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు – స్వామి, డ్రైవర్ రమేష్ – తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని గాయపడిన వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. పోస్టు మార్టం కోసం మృతదేహాలను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు గంజాయి, డ్రగ్స్ను రాష్ట్రం నుంచి పూర్తిగా నిర్మూలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గంజాయి సాగును అరికట్టేందుకు శాటిలైట్, డ్రోన్ల ద్వారా నిఘా ఏర్పాటు చేస్తామని, ముఠా గొడవలకు తావులేకుండా రాయలసీమలో ఉక్కుపాదం మోపుతామని గురువారం (జూన్ 26) హెచ్చరించారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ విషయంలో ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. గంజాయి పెంచేవారని వదిలిపెట్టబోనని వెల్లడించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో నార్కోటిక్స్ సెల్స్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.