లీడ్స్ టెస్ట్ మ్యాచ్లో ఐదు సెంచరీలు సాధించినప్పటికీ టీం ఇండియా ఓడిపోయింది. ఇందుకు చాలా కారణాలున్నాయి. అయితే ఇప్పుడు వాటన్నటినీ మర్చిపోయి ఎడ్జ్బాస్టన్లో జరుగుతున్న 2వ టెస్ట్ మ్యాచ్కు టీమిండియా సన్నాహాలు ప్రారంభించింది. ఈ మ్యాచ్ జూలై 2 నుండి ప్రారంభమవుతుంది. కానీ ఈ మ్యాచ్కు ముందు, గిల్ సేనకు భారీ ఎదురు దెబ్బ తగిలేలా ఉంది. లీడ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసిన జస్ప్రీత్ బుమ్రా ఎడ్జ్బాస్టన్ టెస్ట్ మ్యాచ్కు దూరమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజానికి, లీడ్స్ టెస్ట్లో భారత్ ఓటమికి ప్రధాన కారణం బౌలింగ్ వైఫల్యమే. బుమ్రా తప్ప మరే ఇతర బౌలర్ సమర్థవంతంగా రాణించలేకపోయాడు. ఇప్పుడు స్పీడ్ స్టర్ గనక 2వ టెస్ట్కు దూరమైతే భారత జట్టుకు మరిన్ని సమస్యలు తప్పవు. నిజానికి, టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే, జస్ప్రీత్ బుమ్రా 5 మ్యాచ్లలోనూ ఆడటం లేదని వార్తలు వచ్చాయి. అతను కేవలం 3 టెస్ట్ మ్యాచ్లలో ఆడతాడని సెలెక్టర్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇదే విషయంపై టీం ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ, ‘బుమ్రా ఏ మూడు మ్యాచ్లు ఆడతాడనేది పెద్ద ప్రశ్న. బుమ్రా 3 మ్యాచ్లు మాత్రమే ఆడతాడని నివేదిక నిజమైతే, అతను రెండవ టెస్ట్ మ్యాచ్కు దూరంగా ఉంటాడు. ఎందుకంటే బుమ్రా లార్డ్స్లో జరుగుతున్న మూడవ మ్యాచ్లో ఆడాలనుకుంటున్నాడు. లార్డ్స్ మైదానం ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి బుమ్రా ఇక్కడ బాగా బౌలింగ్ చేయగలడు’
‘లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ కు ముందు బుమ్రాకు తగినంత విశ్రాంతి ఇవ్వాలి. ఒక వేళ అతను ఎడ్జ్ బాస్టన్ లో ఆడితే, అతను లార్డ్స్ లో ఆడలేడు. ఎందుకంటే రెండు మ్యాచ్ ల మధ్య నాలుగు రోజుల గ్యాప్ మాత్రమే ఉంది. అయితే, బుమ్రాను ఏ టెస్టుల్లో ఆడించాలో, ఏ టెస్టులు ఆడకూడదో జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకుంటుంది. రెండో టెస్ట్ మ్యాచ్లో బుమ్రాను ఆడించకపోతే, ఆ టెస్ట్ మ్యాచ్లో కూడా భారత్ ఓడిపోయే ప్రమాదం ఉంది. తొలి టెస్ట్ మ్యాచ్లో బుమ్రా చాలా ఓవర్లు వేశాడు. ఇప్పుడు అతనికి విశ్రాంతి అవసరం. అలాగే, ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో టీమ్ ఇండియా రికార్డు చాలా పేలవంగా ఉంది. అందువల్ల, రెండో టెస్ట్లో జట్టు ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందో చూసేందుకు ఆసక్తి గా ఎదురుచూస్తున్నాను’ అని రవిశాస్త్రి పేర్కొన్నారు.
ఎడ్జ్బాస్టన్లో తొలి విజయం కోసం టీమ్ ఇండియా చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే భారత జట్టు ఇక్కడ ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు. ఈ మైదానంలో భారత జట్టు చాలాసార్లు గెలుపుకు దగ్గరగా వచ్చి ఓడిపోయింది లేదా డ్రా చేసుకుంది. ఎడ్జ్బాస్టన్లో టీమ్ ఇండియా ఏడు మ్యాచ్లు ఆడింది. వీటిలో మూడుసార్లు ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..