విదేశాలకు వెళ్లాలని కలలు కనేవారికి వీసా పొందడం ఇప్పుడు ఒక పెద్ద ఛాలెంజ్గా మారింది. ముఖ్యంగా అమెరికా వీసా రావడం కష్టంగా మారింది. అప్లికేషన్ ప్రాసెస్లో ఎన్నో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చాలా సెక్యూరిటీ చెకప్స్ ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పుడు ఈ ప్రాసెస్లో మరో కొత్త మార్పు వచ్చింది. సోషల్ మీడియా సెట్టింగ్ కూడా వీసా అప్రూవల్కి కీలకం కానుంది. ఇకపై, విద్యార్థులు, పర్యాటకులు సహా వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు తమ సోషల్ మీడియా అకౌంట్స్ను పబ్లిక్ సెట్టింగ్లో ఉంచడం తప్పనిసరి అని అధికారులు తేల్చి చెప్పారు. USఎంబసీ-ఇండియా ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఎవరైతే F, M, J నాన్ఇమ్మిగ్రెంట్ వీసాలకు అప్లై చేస్తారో వాళ్లంతా కూడా సోషల్ మీడియా వెట్టింగ్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాళ్ల సోషల్ మీడియా అకౌంట్లలో ఉన్న ప్రైవసీ ఆప్షన్ని డిసేబుల్ చేసి.. అంతా పబ్లిక్ చేసేయాలి. ఏ మాత్రం దాపరికం ఉండకూడదు.
అమెరికా వీసాల్లో F రకం వీసాను చదువుకునే విద్యార్ధులకు ఇస్తారు. M రకం వీసా ఒకేషనల్ కోర్సుల కోసం అప్లై చేసేవారికి లభిస్తుంది. J అంటే ఎక్స్చైంజ్ విజటర్ వీసా. అంటే రీసెర్చ్, స్కాలర్స్, ఇంటర్న్షిప్కు వెళ్లేవారికి ఇస్తారు. హెచ్1బి వీసాలకు ఇప్పటికే చాలా నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు మిగిలిన వీసాలకు కూడా నిబంధనలు విధించింది అమెరికా. చాలామంది సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, పుట్టిన తేదీ, వయస్సు, కుటుంబ వివరాలు ప్రైవసీలో పెడుతుంటారు. యూఎస్ ఎంబసీ విధించిన నో ప్రైవసీ రూల్ ప్రకారం ఇక అన్నీ బహిర్గతంగా ఉండాలి. సోషల్ మీడియాలో చాలా మంది తమకు ఇష్టమైన ఫోటో పెట్టుకుంటారు. కానీ US వెళ్లాలనుకుంటే అది కుదరదు, ఖాతాదారుడి ఫోటోనే ఉండాలి. ఇదంతా ఎందుకంటే US వీసా అప్లై చేసినప్పుడు ఈ సమాచారాన్ని ఎంబసీ అధికారులు తనిఖీ చేస్తారు. ఏ మాత్రం తేడా అన్పించినా వీసా తిరస్కరిస్తారు.